హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఏపీ చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా షెకావత్ స్పందిస్తూ.. నీటి పంపకాల విషయంలో ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కేఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు షెకావత్ ఫోన్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగుతుండటంపై అయ్యర్పై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. రాయలసీమ లిఫ్ట్, ఆర్డీఎస్పై వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
రెండు, మూడు రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో తనిఖీ చేయాలని, ఏపీ చెప్తున్నట్టుగా డీపీఆర్ కోసం ప్రాథమిక అన్వేషణ మాత్రమే జరుగుతున్నదా? ఏవైనా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయా? ఒకవేళ జరిగితే ఏయే పనులు.. ఎంత మేర జరిగాయి? వంటి పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. పూర్తి వివరాలతో వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏపీకి వెళ్లేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని కేంద్రమంత్రికి అయ్యర్ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాము ఏపీకి వెళ్లి తనిఖీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒక బృందాన్ని గతంలోనే నియమించామని చెప్పినట్టు పేర్కొన్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఇంత వరకు ఏర్పాట్లు చేయలేదని వివరించినట్టు వెల్లడించాయి. ఏపీ సహకరించకుంటే రక్షణ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక బలగాలను పంపుతామని, కచ్చితంగా ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నివేదిక అందించాలని షెకావత్ ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల రక్షణలో కేఆర్ఎంబీ బృందం రెండు, మూడు రోజుల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తోపాటు ఆర్డీఎస్ పనులను పరిశీలించనున్నట్టు సమాచారం.
రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఏపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాస్తవానికి ప్రాజెక్టుపై ఏపీ మొదటి నుంచీ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. ఈ ప్రాజెక్టు అక్రమమని తెలంగాణ వ్యతిరేకించినా పట్టించుకోకుండా పనులు ప్రారంభించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ, కేంద్రజల్శక్తి శాఖ, ఎన్జీటీకి ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్లోనూ నిలదీసింది. అయినా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ కోసం ప్రాథమిక అన్వేషణ మాత్రమే చేస్తున్నామని, ఎలాంటి ప్రధాన నిర్మాణ పనులు చేపట్టటం లేదని బుకాయిస్తూ తప్పించుకుంటున్నది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు చేపట్టవద్దని ఎన్జీటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేఆర్ఎంబీ కమిటీని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిజం బయటికి వస్తుందనే ఉద్దేశంతో నిజనిర్ధారణ కమిటీకి సైతం ఏపీ సహకరించటం లేదు.
దీంతో తెలంగాణ క్యాబినెట్ తీవ్రంగా స్పందించింది. పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేఆర్ఎంబీకి ఆధారాలతో ఫిర్యాదు చేసింది. వీటిని పరిశీలించిన కేఆర్ఎంబీ ఎత్తిపోతల పథకం పనులను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను సమర్పించి, ఆమోదం పొందేవరకు పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించవద్దని స్పష్టం చేసింది. కొన్ని నెలలుగా కోరుతున్నా.. నిజనిర్ధారణ కమిటీకి ఎందుకు సహకరించడం లేదని కేఆర్ఎంబీ ప్రశ్నించింది. తాజాగా ఎన్జీటీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ తీర్పును ఉల్లంఘిస్తున్నట్టు తేలితే ఏపీ సీఎస్ను జైలుకు పంపుతామని హెచ్చరించింది.