హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (వైటీపీఎస్) నిర్మాణం విషయంలో చెన్నై ఎన్జీటీ బెంచ్ తీర్పుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని అనుమతులూ సాధించి, నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిన సమయంలో మళ్లీ మొదటి నుంచి సర్వేలు చేయాలని ఆదేశించటంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. గతంలో చేసిన అధ్యయనాలన్నీ మళ్లీ చేయాలనడం ఏమిటని, ఇలాంటి అసాధారణ తీర్పు ఎక్కడా చూడలేదని అంటున్నారు.
1. రేడియోధార్మికత ప్రభావం
2. యాష్ పాండ్స్ డిజైన్, నిర్మాణం, నిర్వహణ
3. ప్లాంటుకు 25 కిలోమీటర్ల పరిధిలో గాలి నాణ్యత (ఏఏక్యూ) ప్రభావం
4. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, వైటీపీఎస్ మధ్య ఉన్న కచ్చితమైన దూరం
ఎన్జీటీ ఆదేశాల్లోని ఒక్కో అంశాన్ని పరిశీలిస్తే..
1. రేడియోధార్మికత: దీనిపై పర్యావరణ అనుమతులకు ముందే అధ్యయనంచేశారు. వైటీపీఎస్లో ఉపయోగించే బొగ్గును బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్)కు పంపి రేడియో ధార్మికతను నిర్ధారించారు. ఇందు లో నిబంధనలకు లోబడే రేడియోధార్మికత ఉన్నదని నివేదికలో స్పష్టంగా ఉన్నది. దీనిని పరిశీలించాకే కేంద్రం ఈసీ ఇచ్చింది.
2. యాష్ పాండ్స్: వైటీపీసీలో 50 శాతం దేశీయ, 50 శాతం విదేశీ బొగ్గును ఉపయోగించాలని మొదట నిర్ణయించారు. దీనికే కేంద్రం అనుమతించింది. ఇందుకు అనుగుణంగానే 50శాతం దేశీయ బొగ్గుకోసం సిం గరేణితో.. 50శాతం విదేశీ బొగ్గు కోసం ఎం ఎస్టీసీ సంస్థతో ఒప్పందం చేసుకొన్నారు. 11.11.2020న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆఫీస్ ఇచ్చిన మెమోరాండంలో ‘ఇప్పటికే ఈసీ (ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్) కలిగిన థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ఉపయోగించే బొగ్గును ఎలాగైనా మార్పుకోవచ్చు. అంటే దిగుమతి చేసుకొనే బొగ్గు నుంచి దేశీ య బొగ్గుకు, దేశీయ బొగ్గు నుంచి దేశీయ బొగ్గుకు, దేశీయ బొగ్గు నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గుకు మార్చుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని స్పష్టంగా పేర్కొన్నది. విదేశీ బొగ్గు ధరలు భారీగా పెరగటంతో టీఎస్ జెన్కో అప్పటికే 50 శాతం ఉన్న సింగరేణి బొగ్గును 100 శాతానికి.. అంటే పూర్తిగా సింగరేణి (దేశీయ) బొగ్గును వాడేలా ఒప్పందం చేసుకొన్నది. అయితే, విదేశీ బొగ్గుతో బూడిద 15 శాతం మాత్రమే ఉంటుంది. స్వదేశీ బొగ్గు తో 30 శాతం ఉంటుంది. ఈ లెక్కన 100 శాతం దేశీయ బొగ్గు వాడితే బూడిద శాతం 22.5 అవుతుంది కదా అనే అనుమానాలు వచ్చాయి. పర్యావరణ అనుమతుల్లో పేర్కొ న్న నిబంధనల ప్రకారం బూడిద రేణువులు (ఎస్పీఎం-సస్పెండెండ్ పర్టిక్యులర్ మ్యాట ర్) 30 ఎంజీ/ఎన్ఎం3గా ఉండాలి. ఎస్వోఎక్స్ (సల్ఫర్ డై ఆక్సైడ్) 100 ఎంజీ/ఎన్ఎం3గా, ఎన్వోఎక్స్ (నైట్రోజన్ ఆక్సైడ్) 100 ఎంజీ/ఎన్ఎం3 ఉండాలి. అందుకు అనుగుణంగానే ప్లాంటును డిజైన్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈసీ సూచించిన అంశాలపైనే సుమారు రూ.2,523 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
బూడిద సమస్యే ఉండదు
యాష్ పాండ్స్ను ఈసీలో పేర్కొన్నట్టుగానే 400 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఢిల్లీ ఐఐటీలో రిటైర్డ్ ప్రొఫెసర్ వీఎస్ రాజు ఈ డిజైన్లను రూపొందించారు. బూడిద నీటిని ఒడిసిపట్టే లా రికవరీ సిస్టంను కూడా నిర్మిస్తున్నారు. ఆ నీటిని తిరిగి వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టుకు 50 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే 8 సిమెంటు పరిశ్రమలు ఉన్నా యి. 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో 22 సిమెం టు పరిశ్రమలున్నాయి. వచ్చే బూడిదను వీటి కి సరఫరా చేయడం ద్వారా నాలుగేండ్లలోనే 100 శాతం బూడిద రహితంగా చేయవచ్చు.
3. గాలి నాణ్యత: ప్రాజెక్టు నుంచి 10 కిలోమీటర్ల వైశాల్యంలో గాలి నాణ్యతను పరీక్షించి ఇచ్చిన నివేదికను పరిశీలించిన తరువాతే కేంద్రం ఈసీ జారీచేసింది. ఇప్పుడేమో 25 కిలోమీటర్ల వైశాల్యంలో అధ్యయనం చేయాలని ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. 10 కిలోమీటర్ల పరిధిలోనే గాలి స్వచ్ఛంగా ఉన్నప్పుడు 25 కిలోమీటర్ల పరిధిలో ఏం ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
4. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దూరం: వైటీపీఎస్కు అమ్రాబాద్ టైగర్ రిజర్వుకు మధ్య కచ్చితమైన దూరం ఎంతున్నదనేదానిపై అధ్యయనం చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. నిజానికి 10 కిలోమీటర్ల లోపు దూరం ఉంటే.. వైల్డ్లైఫ్ విభాగం నుంచి మరో అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సరిహద్దుకు వైటీపీఎస్ 14.03 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని ఇప్పటికే తేల్చారు. పైగా ప్రాజెక్టు, టైగర్ రిజర్వ్ మధ్యలో అడవి జంతువుల సంచరించే దారులు లేవని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) అండ్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డన్ అధికారిక సమాచారం (ఆర్సీ నం. 3401/2016/డబ్ల్యూల్-1, తేదీ 5.5.2016) అందించారు. ఇలా అన్ని రకాల అనుమతులు, నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పటికీ, మళ్లీ అధ్యయనం చేయాలని ఆదేశించటం నిర్మాణాన్ని ఆలస్యం చేయటం కోసమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.30 వేల కోట్లు కాగా, సుమారు రూ. 16 వేల కోట్లు ఖర్చు చేశారు. ఎన్జీటీ తీర్పుతో పనులన్నీ ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
తీర్పుపై జెన్కో సీఎండీ సమీక్ష
ఎన్జీటీ తీర్పుపై శుక్రవారం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ (ఎంవోఈఎఫ్) నుంచి వచ్చే సూచనలమేరకు పూర్తిస్థాయి నివేదికను మరోసారి పంపించాలని నిర్ణయించారు. పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకొనే సమయంలో 14.9.2016 నాటి ఎంవోఈఎఫ్ నోటిఫికేషన్ ప్రకారమే గాలి నాణ్యతపై అధ్యయనం చేశారు. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం 25 కిలోమీటర్ల పరిధిలో కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అన్ని పనులు పూర్తిచేసి నిర్దేశిత సమయంలోగా విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు.