హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ మరోసారి విషం చిమ్మింది. ఈ ప్రాజెక్టుతో తీవ్ర నష్టం కలుగుతుందంటూ రాద్ధాంతం చేస్తున్నది. ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను వినిపించేందుకు అవకాశమివ్వాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఎదుట వాదించింది. పాలమూరు ప్రాజెక్టు పనుల్లో తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ ఏపీలోని ముదిరెడ్డిపల్లికి చెందిన వెంకటయ్య ఎన్జీటీలో పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర గనులశాఖను నోడల్ ఏజెన్సీగా నియమించడంతోపాటు, క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యావరణ ఉల్లంఘనలు జరిగియో? లేదో? పరిశీలించి నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ గతంలో ఆదేశించింది. అయితే నివేదిక సమర్పించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్జీటీ.. నోడల్ ఏజెన్సీగా తెలంగాణ గనులశాఖను తొలగించి కేఆర్ఎంబీని నియమించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మా ణం వల్ల ఏపీ తీవ్రంగా ప్రభావితమవుతుందని, తమ అభ్యంతరాలను వినిపించేందుకు అవకాశమివ్వాలని, పిటిషన్లో తమను ఇంప్లీడ్ చేయాలని ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్లో పిటిషన్ను దాఖలు చేసింది. దీంతో ఏపీకి ట్రిబ్యునల్ అవకాశమివ్వడంతో పాటు, తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.