NGRI | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): హిమాలయ శ్రేణుల్లోని ఘాట్ ప్రాంతాలకు భూకంపాల ప్రమాదం పొంచి ఉన్నదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) వెల్లడించింది. ఇటీవల ఎన్జీఆర్ఐ అరుణాచల్ప్రదేశ్ ప్రాంతంలో నిర్వహించిన అధ్యయనంలో సూక్ష్మ పీడనం కూడా భూకంపాలను ప్రభావితం చేస్తున్నదని గుర్తించారు.
సూక్ష్మ ప్రకంపనలు, అగ్ని విస్ఫోటనంలేని ప్రకంపనల కారణంగా భూమి అంతర్భాగంలో పొరలు కదులుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రకంపనలు క్రియాశీలంగా ఉన్న ఈశాన్య రాష్ర్టాల్లో అరుణాచల్ ప్రాంతం కూడా ఉన్నదని అన్నారు. భూమిపొరల్లో సూక్ష్మమైన ఒత్తిళ్లు కూడా భూకంపాలను, ప్రకంపనలను ప్రేరేపిస్తున్నాయని అబేరాం బన్సల్, టోనీ సైనీ బృందం తమ పరిశోధన వివరాలను సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురించారు.
ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 34 భారీ భూకంపాలను సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ విశ్లేషించింది. వీటి ద్వారా స్వల్పమైన ఒత్తిడి కూడా భూకంపాలను, ప్రకంపనలను ప్రేరేపిస్తాయని పరిశోధకులు గుర్తించారు. అరుణాచల్ప్రదేశ్ పరిధిలోని హిమాలయాల్లో ఒక కిలోపాస్కల్ కంటే తక్కువ ఒత్తిడితోనే ప్రకంపనాలు వచ్చినట్టు పేర్కొన్నారు. రిక్టర్ స్కేల్పై 5.5కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించినప్పుడు, ఆ తరంగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తాయని తెలిపారు. వీటి ద్వారానే భూకంప ప్రమాదాలను అర్ధం చేసుకోవడంలో సహాయపడుతుందని నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు.