హైదరాబాద్ : పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య రాబోయే నాలుగు వారాలు కీలకమని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ఫిబ్రవరి మధ్యకి కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రజలంతా వైద్య, ఆరోగ్యశాఖ సూచనలను ప్రజలంతా పాటించాలని కోరారు. తప్పనిసరిగా ఇంటా, బయట మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరుతున్నామన్నారు. టీకా తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని, గాలి బాగా తగిలే ప్రదేశాల్లో ఉండాలన్నారు. వ్యాధి లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలని, తక్కువ లక్షణాలున్న వారు హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో ముమ్మరంగా కొవిడ్ పరీక్షలు చేసేందుకు రెండు కోట్ల కొవిడ్ పరీక్షల కిట్లను సిద్ధంగా ఉంచినట్లు డీహెచ్ తెలిపారు. కోటికిపైగా హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామన్నారు. హోం ఐసోలేషన్ కిట్లలో తొమ్మిది రకాల మందులంటాయన్నారు. కరోనా మూడోదశను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. ప్రజారోగ్య సిబ్బందికి నేటి నుంచి సెలవులు రద్దు చేశామన్నారు. వచ్చే నాలుగు వారాలు ఎలాంటి సెలవులు ఇవ్వబోమని, సంక్రాంతికి కరోనా మరింత పెరుగుతుందన్నారు.
రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నియంత్రించుకోవాలని కోరారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని, ఆంక్షల వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతారన్నారు. రాష్ట్రంలో 101.1 శాతం తొలిడోసు, 71శాతం మందికి రెండు డోసుల టీకా వేసినట్లు వివరించారు. జనవరి 26 నాటికి రెండో డోసు వందశాతం పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. 15-18 ఏళ్ల వారిలో 10శాతం మందికి తొలిడోసు ఇచ్చినట్లు డీఎస్ తెలిపారు. విద్యార్థుల వద్దకే వెళ్లి టీకా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కొవిడ్ నిబంధనలు నిబంధనలు పాటిస్తే త్వరగా మహమ్మారి నుంచి బయటపడొచ్చన్నారు. నేటి నుంచి పీహెచ్సీలో కొవిడ్, ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.