హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ);టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించాలని న్యూజిల్యాండ్ ఎన్నారైలు కోరారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, మోదీ, బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కేసీఆర్ ఒక్కరే ఎండగడుతున్నారని పేర్కొన్నారు. మోదీ, అమిత్షా కుట్రలను ఛేదించి దేశాన్ని రక్షించగలిగే వ్యూహకర్తగా తమకు కేసీఆర్ ఒక్కరే కనినిస్తున్నారని న్యూజిల్యాండ్ ఎన్నారైలు విశ్వసిస్తున్నారు.
న్యూజిల్యాండ్ ఎన్నారైల మనోగతం దేశానికి మంచిచేసే నేత కేసీఆర్
కొత్త జాతీయ పార్టీ స్థాపించాలనే కేసీఆర్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పార్టీ విధానాలకు విభిన్నమైన ఆలోచన దృక్పథంతో ఉన్న కేసీఆర్ దేశ ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకం ఉన్నది. దేశాన్ని కొత్త విధానాలతో ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా కేసీఆర్ అవతరిస్తారని నా ప్రగాఢ నమ్మకం. ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్మి తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఇటువంటి నాయకుడి చేతిలో దేశంలో ఉంటే బాగుపడుతుంది.
– కల్యాణ్రావు కాసుగంటి, న్యూజిల్యాండ్ ఎన్నారై
ఏకత్వాన్ని సాధించే నాయకుడు కేసీఆర్
నాకు తెలంగాణకు చెందిన చాలామంది మిత్రులు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిని సీఎం కేసీఆర్ అద్భుతంగా పరిరక్షిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం గురించి చిన్నప్పుడు చదువుకున్నాను. అయితే దేశంలో ప్రస్తుతం భిన్నత్వ వాతావరణానికి విలువ ఇవ్వకుండా కేంద్రం వ్యవహరిస్తున్నది. దేశ భిన్నత్వాన్ని ఆకళింపు చేసుకున్న కేసీఆర్ ఏకత్వం సాధిస్తారనే విశ్వాసం ఉన్నది. హైదరాబాద్లో మౌలిక సదుపాయలు బాగా ఉండటం వల్ల ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీలు అక్కడికి వెళుతున్నాయి. బెంగుళూర్తో హైదరాబాద్ పోటీపడుతున్నది.
– ప్రకాశ్ బిరాదర్, న్యూజిల్యాండ్ ఎన్నారై (కర్నాటక)
దేశరాజకీయాల్లో కేసీఆర్ విజయం సాధిస్తారు
దేశ రాజకీయాల్లో కేసీఆర్ తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం ఉన్నది. కేసీఆర్ మొదట్లో తెలంగాణ రాష్ర్టాన్ని సాధిస్తానని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తాననే మాటను మిగతావాళ్లకు తేలికగా కనిపించవచ్చు. కానీ కేసీఆర్ పట్టుదల చాలా గొప్పది. ఆయన పట్టుపట్టితే వీడరు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టే జాతీయ పార్టీ ద్వారా దేశాన్ని కేసీఆర్ అభివృద్ధి చేయగలరు. చాలా సంవత్సరాల తరువాత హైదరాబాద్ను చూశాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించాను ఇంత తక్కువ కాలంలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది.
–డాక్టర్ ప్రీతం దుర్శనపల్లి, అక్లాండ్, న్యూజిల్యాండ్
జాతీయ పార్టీ పెట్టండి: సీఎం కేసీఆర్తో మహారాష్ట్ర బృందం
మహారాష్ట్రకు చెందిన బాబూరావు పాటిల్ కదమ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ప్రగతి భవన్లో శనివారం సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసింది. దేశమంతా తెలంగాణ తరహా పథకాలు రావాలని ఆకాంక్షించింది. మోదీ సర్కార్ను ధైర్యంగా ఎదుర్కొంటున్నది కేసీఆర్ ఒక్కరేనని.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే మొదటి సభను తమ వద్దే పెట్టాలని, మరాఠ్వాడ నుంచి కేసీఆర్కు సంపూర్ణ మద్దతు లభిస్తుందని తెలిపింది.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో ఆదివాసీ, గిరిజన సంఘాల నేతలు శనివారం భేటీ అయ్యారు. గిరిజన జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు చారిత్రక నిర్ణయం తీసుకొన్న సీఎం కేసీఆర్కు తాము రుణపడి ఉంటామని చెప్పారు. గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులు రూప్సింగ్, తిరుపతినాయక్, రవీందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.