హైదరాబాద్ : తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. అంబేద్కర్పైన ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగర్వంగా చాటుకున్నారన్నారు. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టి బీజేపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్-3ని అంబేద్కర్ పొందుపరచడంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు.
అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ పరిపాలన సముదాయమైన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలని సీఎం నిర్ణయించడం తెలంగాణకే గర్వకారణమన్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఆదర్శమని స్పష్టం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయాన్ని తీసుకుందని చెప్పారు.
ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ చేస్తున్న డిమాండ్ను, తెలంగాణ అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెడితే భారతదేశం ప్రతిష్ట గౌరవం ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి రాజ్యాంగంపై ఉన్న చిత్తశుద్ధిని బీజేపీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ దిశగా తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కవిత సూచించారు.