New secretariat | 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణం. చుట్టూ 8 ఎకరాల మేర పచ్చదనం. మధ్యలో ఇంధ్రభవనాన్ని తలపించే నూతన సముదాయం. పగలు ధవళకాంతులతో ధగధగమని మెరిసే అపురూప నిర్మాణం. రాత్రి జాజ్జల్యమానంగా వెలిగే సుందర దృశ్యం. 265 అడుగుల ఎత్తులో, ఆరు అంతస్థులతో, అత్యాధునిక వసతులతో హంగులతో, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలువెత్తుగా నిలిచివెలుగుతున్నది సరికొత్త సచివాలయం.
సర్వమత సమ్మేళనానికి సంకేతంగా అచ్చెరువొందే రీతిలో మందిర్, మసీద్, చర్చిల నిర్మాణం ఓ వైపు. వందలాది వాహనాలు నిలిపేందుకు విశాలమైన పార్కింగ్ స్థలం మరోవైపు. అదే ప్రాంగణంలో మరింత వన్నెలద్దేందుకు.. అచ్చం పార్లమెంట్ తరహాలో రెడ్శాండ్ స్టోన్తో రెండు ఫౌంటెయిన్లు చూపరులను కట్టిపడేస్తాయి. ఇక భవన నిర్మాణాన్ని పరిశీలిస్తే.. తెలంగాణ సాంస్కృతిక సంపద, శాంతియుత జీవనశైలి అణువణువునా ప్రతిబింబించేలా భవనాన్ని తీర్చిదిద్దారు. కొత్తగా సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ సంక్పలించింది మొదలు ఎన్నో విమర్శలు చేసిన వారు నోరు వెళ్లబెట్టుకునేలా సగర్వంగా, సర్వాంగ సుందరంగా, అనితరసాధ్యంగా ముస్తాబై ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్నది. సచివులు కొలువై ఉండే ఈ నూతన సచివాలయం నాటి శ్రీకృష్ణదేవరాయల భువన విజయాన్ని తలంపునకు తెచ్చేలా ఉన్నది. ఇది సీఎం కేసీఆర్ భవన విజయం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం భవనంలోని ముఖ్యమంత్రి పేషీ ఇది. భవనం ఆరవ అంతస్థులో సర్వ హంగులతో రూపుదిద్దుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం కారిడార్ను ఇలా ప్రత్యేకమైన మార్బుల్స్తో తీర్చిదిద్దారు. ఈ నెల 30న ప్రారంభానికి సిద్ధమవుతున్న సచివాలయం మరిన్ని చిత్రాలు..
సువిశాల స్థలంలో ఆరు అంతస్థులతో, అత్యాధునిక వసతులతో హంగులతో నిర్మితమై ఇంద్రభవనాన్ని తలపిస్తున్న నూతన సచివాలయం. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలువెత్తుగా వెలుగొందుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్
నూతన సచివాలయంలో ముందు భాగంలో పార్లమెంట్ తరహాలో రెడ్శాండ్ స్టోన్తో ఏర్పాటుచేసిన ఫౌంటెయిన్. హెలీప్యాడ్. స్వాగత తోరణం.. హుస్సేన్సాగర్ అందాలు
తెలంగాణ నూతన సచివాలయాన్ని ఇండో పర్షియన్ శైలిలో ఇంజినీర్లు తీర్చిదిద్దారు. ప్రధాన భవనాలపై ఏర్పాటుచేసిన భారీ డోముల చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
వివిధ అంశాలపై అన్ని శాఖల ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించేందుకు సీఎం కాన్ఫరెన్స్ హాలు అత్యాధునిక వసతులతో నిర్మించారు.
సచివాలయంలో ఏర్పాటుచేసిన డైనింగ్ హాలును అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. సరికొత్త డిజైన్ ఫర్నిచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
సచివాలయంలో వివిధ శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేకంగా డెస్కులు ఏర్పాటుచేశారు. కార్పొరేట్కు దీలుగా అందరికీ అనుకూలంగా, అత్యా ధునిక వసతులను ఇక్కడ కల్పించారు. ఎవరి డెస్క్ వారికి కేటాయించారు.
సచివాలయంలో ముందు భాగంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పక్కాగా నిర్మించారు. ముఖ్యమంత్రితోపాటు ఇతర వీఐపీ నేరుగా సచివాలయానికి చేరుకొనేలా ఏర్పాటుచేసిన హెలిపాడ్.
హైదరాబాద్ నడిబొడ్డున, హుస్సేన్సాగర్ తీరాన నిర్మించిన నూతన సచివాలయం విద్యుత్తు కాంతులతో జాజ్జల్యమానంగా వెలుగులీనుతున్నది. చూపరులకు కనువిందు చేస్తున్నది.