Ration Cards | కరీంనగర్ : కొత్త రేషన్ కార్డులు ఇప్పుడే ఇవ్వమని, ప్రజా పాలనలో వచ్చే దరఖాస్తుల పరిశీలన తర్వాతనే అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆయన ప్రజా పాలన గ్రామ సభల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే వంద రోజుల్లో తామిచ్చిన హామీల్లోని ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఇందుకోసం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు జరిగే గ్రామ, బస్తీ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభల్లో తీసుకునే వివరాల ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షిస్తామన్నారు.
తెల్లరేషన్ కార్డులు ఉన్నా, లేకున్నా దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఇపుడు వచ్చే దరఖాస్తుల్లోని డాటా ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామని చెప్పారు. ఒక కుటుంబానికి ఒక దరఖాస్తు ఉంటుందని, దీనిలో అన్ని వివరాలు ఉంటాయని అన్నారు. అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎలాంటి సమస్యలు ఉన్నా తమను ఫోన్లో సంప్రదించాలని సూచించారు. గ్రామ సభల్లో ఒక్క దరఖాస్తుదారు కూడా ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరుకుంటోందని అన్నారు. ఈ నెల 29న కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తున్నామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయమై విచారణకు ఆదేశిస్తామని చెప్పారు.
ఒక్క దరఖాస్తు కూడా తిరస్కరించవద్దు
గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఒక్కటి కూడా అధికారులు తిరస్కరించేందుకు వీలు లేదని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వాటిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రజా పాలనపై అధికారులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. కరీంనగర్ను అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలపాలని కోరారు.