హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులు, సంరక్షకులు లేని పిల్లలకు(అనాథలకు) ప్రభుత్వమే అన్ని తానై బాధ్యత చేపట్టేందుకు వీలుగా దేశంలోనే అత్యుత్తమైన విధానం తీసుకురానున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఉన్నట్లు వెల్లడించారు. దీనికోసం అంగన్వాడీలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు రాష్ట్రంలోని అనాథల సమగ్ర సమాచారం సేకరించి, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా, అందరికీ ప్రభుత్వం అందించే ఫలాలు చేరేలా పనిచేయాలని అన్నారు. మంగళవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో అనాథలు, కోవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లలకు సంబంధించి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులందరితో మంత్రి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో అందరి సంక్షేమం, బాగు గురించి సీఎం కేసీఆర్ ఆలోచిస్తారన్నారు. కరోనా అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. అనాథలు అయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మనకు పిల్లలు ఉంటే వారి భవిష్యత్ కోసం ఎలా ఆలోచిస్తామో, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనాథల గురించి ఆలాగే ఆలోచించి వారి బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించిందన్నారు.
తల్లి, బిడ్డల సంరక్షణకు అంగన్వాడీల సేవలు ఇంకా పెరగాలని మంత్రి అన్నారు. అనాథలకు సంబంధించి సంపూర్ణ సమాచారం సేకరించాలన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చే అనాథల నూతన విధానంలో మన పని వల్ల తెలంగాణను చూసి భారతదేశం అనుసరించే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, యూనిసెఫ్ ప్రతినిధి మురళి, ఎస్సీపీసీఆర్ చైర్మన్ శ్రీనివాసరావు, సభ్యులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.