హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 2000 మెగావాట్ల వాడకం తగ్గిపోయింది. సోమవారం ఒక్కరోజే ఖమ్మంలో 315 మెగావాట్ల విద్యుత్తు వాడగా, అదే మంగళవారానికి వచ్చేసరికి కేవలం 55 మోగావాట్లే వినియోగించారు. అంటే దాదాపు 260 మెగావాట్లు డౌన్. అదే వరంగల్లో 476 నుంచి 163, కరీంనగర్ 838 నుంచి 413, ఆదిలాబాద్ 285 నుంచి 82, నిజామాబాద్ 395 నుంచి 208 మోగావాట్లకు విద్యుత్తు వినియోగం పడిపోయింది. ఇలా రాష్ట్రమంతటా విద్యుత్తు వినియోగం తగ్గిపోయింది. సోమవారం వరకు భానుడి భగభగలతో విద్యుత్తు వాడకం అమాంతం పెరిగింది.
సోమవారం ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడటంతో విద్యుత్తు వినియోగం సగానికి సగం తగ్గింది. దక్షిణ తెలంగాణలోనూ వెయ్యి మెగావాట్లకుపైగా డిమాండ్ తగ్గింది. రాబోయే ఐదు రోజులపాటు ఉత్తర తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణశాఖ ప్రకటించింది. విద్యుత్తు డిమాండ్ మరింత తగ్గే అవకాశాలున్నాయి. సోమవారం రాష్ట్రంలో 10,847 మోగావాట్లు గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదు కాగా, మంగళవారం 8,848 మెగావాట్లకు చేరింది. అత్యధిక డిమాండ్ టీఎస్ఎస్సీడీసీఎల్లోనే నమోదయ్యింది.