పెచ్చులూడిపోయి.. ఇనుపచువ్వలు తేలి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ బ్రిడ్జి రామడుగు మండలం గుండి గ్రామంలోనిది. సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ వంతెనను 50 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిర్మించారు. ఈ రహదారి సమీపంలోనే పెద్ద చెరువు ఉండడంతో మత్తడి ద్వారా వచ్చే వరదనీరు వెళ్లేలా ఏర్పాటు చేయగా, దశాబ్దాలు గడిచేకొద్దీ శిథిలావస్థకు చేరింది. వంతెన పైభాగంలో గుంతలు ఏర్పడడంతో పాటు పలుసార్లు వరదనీరు వంతెన పైనుంచి వెళ్లడంతో కింది భాగంలో శ్లాబ్ కోసం వేసిన మెటల్ కొట్టుకుపోయి ఇనుప చువ్వలు తేలాయి. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త వంతెన నిర్మాణం కోసం 2023లో రూ.2.15 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనుల ప్రారంభం నిలిచిపోయింది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. దీంతో వాహనదారులు భయం భయంగా బ్రిడ్జి దాటాల్సిన దుస్థితి ఏర్పడింది.
– రామడుగు, ఆగస్టు 3