హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం 12 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. వీరిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు ముగ్గురు కాగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు తొమ్మిది మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. ఇందులో ఇప్పటివరకు 27 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. శనివారం రిస్క్ దేశాల నుంచి 123 మంది రాగా.. ఇందులో 10 మందికి పాజిటివ్గా తేలింది. ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.
రాష్ట్రంలో శనివారం కొత్తగా 317 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు అనేక రోజుల తర్వాత ఒక శాతం దాటింది. 232 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 217 కేసులు నమోదయ్యాయి. అనేక వారాల తర్వాత కేసులు 200 దాటాయి. రంగారెడ్డిలో 26, మేడ్చల్ మల్కాజిగిరిలో 18 కేసులు వెలుగు చూశాయి.
శనివారం 80 వేల మందికి టీకాలు వేశారు. ఇందులో 16,824 మందికి మొదటిడోస్ వేయగా, 63,986 మందికి రెండో డోస్ వేశారు. మొదటిడోస్ లక్ష్యానికి మించి 2.04 లక్షల డోసులు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38.66 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. 54,581 పడకలు అందుబాటులో ఉన్నాయి.