హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సర్వీస్ క్రమబద్ధీకరణ, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి తలపెట్టిన సమ్మెను కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు విరమించుకున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలతో శుక్రవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల్లో ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఆర్టీయూ తదితర సంఘాల నాయకులు, కాంట్రాక్ట్ ఏఎన్ఎంల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు మంచి వేతనాలు చెల్లిస్తూ, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈ సందర్భంగా శ్రీనివాసరావు గుర్తుచేశారు.
క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో మమేకమవుతూ, వారికి వైద్యసేవలు అందించే ఏఎన్ఎంలు సమ్మె చేయడం వల్ల తలెత్తే ఇబ్బందులను వారికి వివరించారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంల అంశంపై కమిటీని నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఈ నెల 4లోగా ఉత్తర్వులు వెలువడుతాయని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కార్మిక సంఘాల నేతలు సమ్మె విరమిస్తామని హామీ ఇచ్చారు.