హైదరాబాద్ : దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో హైదరాబాద్లో నీరా కేఫ్ను నిర్మించామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas goud) తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరాపాలసీ(Neera policy) లో భాగంగా నీరా ప్రాసెసింగ్, బాటిలింగ్ లపై అధికారులతో చర్చించారు.
అందంగా ముస్తాబైన నీరాకేఫ్..వీడియో
అనంతరం, నీరా కేఫ్ నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా ప్రారంభించడానికి ముందస్తు ఏర్పాట్లను(Arrangements) పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమ, అభివృద్ధి తో పాటు వారి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా ఈ నీరా కేఫ్ ను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
నీరా కేఫ్ పరిశీలనలో భాగంగా మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థల కార్పొరేషన్ చైర్మన్లు డాక్టర్ ఆంజనేయ గౌడ్ ,డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఎండి మనోహర్, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డేవిడ్ రవికాంత్ దత్త రాజ్ గౌడ్ చంద్రయ్య , ఈఎస్లు సత్యనారాయణ, రవీందర్రావు, అరుణ్ కుమార్, విజయ్ భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.