NCERT | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఇండియా పేరును భారత్గా మార్చాలని, భారతీయ ప్రాచీన చరిత్ర స్థానంలో పురాణాలను చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ చేసిన సిఫారసులు అనాగరికమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అధ్యక్షుడు కే జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ కమిటీ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరసరించాలని కోరారు. ఇప్పటివరకు భారతదేశాన్ని ఆంగ్లంలో ఇండియా అని పిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని, కానీ రాజకీయ దురుద్దేశంతో ఎన్సీఈఆర్టీ కమిటీ సభ్యులు రాజును మించిన భక్తిని ప్రదర్శించినట్టు కనిపిస్తున్నదని మండిపడ్డారు.
ఇటువంటి రాజకీయ ప్రేరేపిత వ్యక్తుల వల్ల విద్యారంగం నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ, దేశ చరిత్రను ఏకపక్షం చేయాలనుకోవడం, అశాస్త్రీయ భావజాలాన్ని పాఠ్యపుస్తకాల్లో జొప్పించి విద్యార్థుల ఆలోచనా సరళిని తమకు అనుకూలంగా మార్చాలనుకోవటం తగదని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తులను కమిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.