Jeevan Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి చుక్కెదురైంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చిటికెన నవీన్ కుమార్ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆయన ఆదివారం సిరిసిల్ల పట్టణానికి వెళ్లారు. కానీ పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను నవీన్ కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. తన కుమారుడి మరణంపై దయచేసి శవ రాజకీయాలను చేయొద్దు అంటూ నవీన్ తండ్రి నాగభూషణం దండం పెట్టి విజ్ఞప్తి చేశాడు. మీ రాజకీయ లబ్ది కోసం ఇవాళ వస్తారు.. పోతారు.. కానీ మాకు అండగా ఉండేది మంత్రి కేటీఆర్ అని తేల్చి చెప్పాడు. బాధిత కుటుంబాల వ్యాఖ్యలతో చేసేదేమీ లేక కాంగ్రెస్ నాయకులు బిక్కమొకాలు వేసుకుని తిరిగొచ్చేశారు.
సిరిసిల్ల పట్టణానికి చెందిన చిటికెన నవీన్కుమార్ (30) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేశాడు. ఇటీవల ఓ ప్రైవేట్ బ్యాంక్ ఇంటర్వ్యూకు వెళ్లివచ్చాడు. అనూహ్యంగా శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అదేరోజు సాయంత్రం పోస్టుమార్టం, శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఈ ఆత్మహత్యను ఆయనకు ఆపాదించేందుకు, బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు వ్యూహం పన్నారు. ‘కేసీఆర్ పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్-1కు ప్రిపేరైన సిరిసిల్లకు చెందిన నవీన్కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్తాపానికి గురై ఉరికొయ్యకు వేలాడు. కేసీఆర్పై కేసు పెట్టాలి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రూ.కోటి పరిహారం ఇవ్వాలి. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది’ అంటూ పీసీసీ అధ్యక్షుడు శనివారం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనిని ప్రభుత్వ హత్యగా పరిగణించి, మంత్రి కేటీఆర్పై కేసు నమోదుచేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్ మీడియా సమావేశం పెట్టి మరీ డిమాండ్ చేశారు.
కేసీఆర్ రాజీనామా చేయాలంటూ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. అటు బీజేపీ నాయకులు కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థి పేపర్ల లీక్ కారణంగా మనస్థాపానికి గురై అత్మహత్య చేసుకున్నాడని, దీనికి మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్తో పోస్టులు పెడుతున్నారు. అంతిమయాత్ర సమయంలోనూ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే, నవీన్కుమార్ కుటుంబసభ్యులు ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నవీన్కుమార్ కుటుంబ సభ్యులను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించడంతో అసలు ఆయన గ్రూప్-1కు దరఖాస్తు కూడా చేయలేదని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావడం లేదని తెలిసింది.
ఆత్మహత్య చేసుకున్న చిటికెన నవీన్కుమార్(30) కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. అధైర్య పడవద్దని, మీ కుటుంబానికి అండగా ఉంటామని నవీన్ తండ్రి నాగభూషణరావుకు ధైర్యం చెప్పారు. నవీన్ అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలతోపాటు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
TSPSC | గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు కూడా చేయని యువకుడు పేపర్ లీకైందని ఆత్మహత్య చేసుకున్నాడా?