ఖలీల్వాడి, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. రామన్న పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాయి. పార్టీ కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలు, స్కూళ్లలో నోట్బుక్కుల పంపిణీ, దవాఖానలు, అనాథాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. పలుచోట్ల మొక్కలు నాటి కేటీఆర్కు బర్త్డే విషేస్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ‘సర్’ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వీజీగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తండ్రి కేసీఆర్ ప్రాణాలకు తెగిస్తే, కుమారుడు కేటీఆర్ ఐటీ రంగంలో తెలంగాణను దేశంలో నంబర్వన్గా నిలిపారని గుర్తు చేశారు. మున్సిపల్ మంత్రిగా నగరాలు, పట్టణాలను సుందరీకరణ చేశారన్నారు. జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు సుజిత్సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు అభిలాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిజామాబాద్ రూరల్ మండలంలోని శాస్త్రి నగర్ నిర్మల భవన్ వృద్ధాశ్రమంలో మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పండ్లు పంపిణీ చేశారు. నిజామాబాద్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు అభిలాశ్రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి పండ్లు, దుస్తులు అందజేశారు.
బాన్సువాడలో పార్టీ నేత మోరిల్ శ్రీనివాస్రావు స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో యువకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. వంద పడకల దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మరోవైపు, మహిళలకు పూల మొక్కలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కుర్చీలు, నోట్బుక్కులు, పెన్నులు అందజేశారు. బాల్కొండ, ఆర్మూర్, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి.