TSPSC | కరీంనగర్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సిరిసిల్ల రూరల్: అసలు గ్రూప్-1 పరీక్షలకు దరఖాస్తు చేయని ఓ యువకుడు పేపర్ లీక్ అయినందుకు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడంటే మీరు నమ్ముతారా? కానీ, ‘నమ్మి చావండి’ అన్నట్టుగా కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చిటికెన నవీన్కుమార్ (30) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేశాడు. ఇటీవల ఓ ప్రైవేట్ బ్యాంక్ ఇంటర్వ్యూకు వెళ్లివచ్చాడు. అనూహ్యంగా శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
అదేరోజు సాయంత్రం పోస్టుమార్టం, శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఈ ఆత్మహత్యను ఆయనకు ఆపాదించేందుకు, బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు వ్యూహం పన్నారు. ‘కేసీఆర్ పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్-1కు ప్రిపేరైన సిరిసిల్లకు చెందిన నవీన్కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్తాపానికి గురై ఉరికొయ్యకు వేలాడు. కేసీఆర్పై కేసు పెట్టాలి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రూ.కోటి పరిహారం ఇవ్వాలి. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది’ అంటూ పీసీసీ అధ్యక్షుడు శనివారం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనిని ప్రభుత్వ హత్యగా పరిగణించి, మంత్రి కేటీఆర్పై కేసు నమోదుచేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్ మీడియా సమావేశం పెట్టి మరీ డిమాండ్ చేశారు.
కేసీఆర్ రాజీనామా చేయాలంటూ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. అటు బీజేపీ నాయకులు కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థి పేపర్ల లీక్ కారణంగా మనస్థాపానికి గురై అత్మహత్య చేసుకున్నాడని, దీనికి మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్తో పోస్టులు పెడుతున్నారు. అంతిమయాత్ర సమయంలోనూ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే, నవీన్కుమార్ కుటుంబసభ్యులు ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నవీన్కుమార్ కుటుంబ సభ్యులను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించడంతో అసలు ఆయన గ్రూప్-1కు దరఖాస్తు కూడా చేయలేదని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావడం లేదని తెలిసింది. నవీన్కుమార్ కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు వారి మాటల్లోనే..
ఆత్మహత్య చేసుకున్న చిటికెన నవీన్కుమార్(30) కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. అధైర్య పడవద్దని, మీ కుటుంబానికి అండగా ఉంటామని నవీన్ తండ్రి నాగభూషణరావుకు ధైర్యం చెప్పారు. నవీన్ అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలతోపాటు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మా కొడుకు నవీన్కుమార్ మృతికి గ్రూప్స్ పరీక్షలతో గానీ, లీకేజీలతో గానీ సంబంధం లేదు. చనిపోయిన పుట్టెడు దుఖంతో మేముంటే, ఇష్టానుసారం బయట మాట్లాడుతున్నరు. మాకు సంబంధం లేకుండానే కొంతమంది నాయకులు వారి ఇష్టమొచ్చినట్టు ప్రకటనలు ఇస్తున్నరు. నిజానికి మా కొడుకు.. ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంటర్ పూర్తిచేసిన తరువాత హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు మూడేండ్లు చదివిండు. అక్కడే ఒక హోటల్లో కొద్ది రోజులు ఉద్యోగం చేసిండు. ఆ తరువాత సిరిసిల్ల రిలయన్స్ ట్రెండ్స్లో చేసిండు.
మూడు నెలల క్రితం మానేసి ఒక ప్రైవేట్ బ్యాంకులో ఔట్సోర్సింగ్ కింద క్లర్క్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నడు. ఇంటర్వ్యూ కూడా అయింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ తమ బ్యాంకు నిబంధనలకు సరిపోదని చెప్పడంతో కొంత మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఇదే విషయాన్ని మాతో కూడా చెప్పిండు. ‘ఇది కాకపోతే ఇంకో జాబు చూసుకో బిడ్డా’ అని మేం చెప్పినం. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. కొన్ని పార్టీల నాయకులు ఫోన్ చేసి తమతో కలిసి రావాలని కోరారు. కానీ వాస్తవాలు మాకు తెలుసు కాబట్టి, ఆ చెడ్డ రాజకీయాల్లోకి మేం వెళ్లాలనుకోలె. కొంతమంది వస్తే ఇందులో మీకేమి సంబంధం అన్నట్టుగానే మాట్లాడాం. మా కొడుకు చావును రాజకీయం చేయాలని చూస్తున్న మాట వాస్తవమే. నిజానికి ఇందులో ప్రభుత్వానికి గానీ, గ్రూప్-1 లీకేజీలకు గానీ ఎటువంటి సంబంధం లేదు. అసలు గ్రూప్స్ రాయలన్న ఉద్దేశమే మా కొడుక్కు లేదు.
– నాగభూషణం, నవీన్కుమార్ తండ్రి
మా కొడుకు చావును క్యాష్ చేసుకుందామని కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా స్క్రోల్ చేస్తున్నాయి. మేం చెప్పని విషయాలు చెప్పినట్టుగా రాస్తున్నారు. మా కొడుకు చావుకు, గ్రూప్-1 పరీక్షలకు, పేపర్ లీకేజీలకు ఎటువంటి సంబంధం లేదు. అనవసరంగా మమ్మల్ని బదనాం చేస్తుండ్రు. మా బాధలో మేమున్నాం. మేము పిలుకుండానే కొంతమంది నాయకులు వస్తుండ్రు. ఏదో చెప్పే ప్రయత్నం చేసిండ్రు. పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. వచ్చి రాగానే గ్రూప్-1 రాసిండా? ప్రిపేర్ అవుతుండా? అని అడుగుతుండ్రు. దానిని బట్టి వారి ఉద్దేశం మాకు అర్థమైంది. మా వద్దకు వచ్చిన వాళ్లను కూడా కట్చేసినం. అయినా మాకు తెలియకుండానే పోస్టింగ్లు పెడుతుండ్రు.
– శ్రీనివాస్, నవీన్కుమార్ బాబాయి
మా తమ్ముడు నవీన్కుమార్ నేను స్నేహితుల మాదిరే ఉంటం. ఎందుకు అత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదు. నిజానికి మాకు ఎటువంటి సమస్య లేదు. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ పనిచేయదంటూ బ్యాంకు వాళ్లు చెప్పారంటూ కొంత బాధపడ్డాడు. అది తప్ప.. ఆయన ఏనాడూ ఇబ్బంది పడలేదు. గ్రూప్-1కు నేను ప్రిపేర్ అవుతున్నా. మా తమ్ముడు గ్రూప్-1కు దరఖాస్తే చేయలేదు. అతనికి సాఫ్ట్వేర్ వైపు దృష్టి మళ్లింది. ఆన్లైన్లో సాఫ్ట్వేర్కు సంబంధించి కోర్సులు చేస్తున్నాడు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. అయితే మా తమ్ముడు గ్రూప్స్కు ప్రిపేర్ అవుతుండని, పేపర్ లీకేజీలతో మనస్తాపం చెంది అత్మహత్య చేసుకున్నాడని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కామెంట్ పెడుతున్నారు. మేము చదువుకున్నోళ్లమే. ఏది వాస్తవమో.. ఏది అవాస్తమో మాకు తెలుసు. ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రతిపక్ష నాయకులను కోరుతున్నా. మా తమ్ముడు చావుకు రాజకీయాలు అపాదించవద్దు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మాకు మా స్నేహితులు పంపిస్తున్నారు. వాటిని చూస్తే బాధేస్తున్నది. రాజకీయాల కోసం మా తమ్ముడి మరణాన్ని వాడుకోవడం బాధగా ఉన్నది.
– రాజు, నవీన్కుమార్ రెండో సోదరుడు