కల్వకుర్తి, జూలై 24 : చేస్తే ఆరు అప్పు.. చేయకుంటే మూడు అప్పు అనే నానుడి వ్యవసాయానికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. వ్యయమే కాని సాయం కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలంటే రైతులు జంకే పరిస్థితులు వచ్చాయి. వెట్టి కష్టం చేసినదానికంటే..కూలో నాలో చేసుకుని పొట్ట పోసుకుంటే నిమ్మలంగా బతుకవచ్చనే ధోరణిలో రైతన్నలు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఠంఛన్గా రైతు బంధు వస్తుడడం, సాగునీటికి ఇబ్బందులు లేకపోవడం, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో జమచేసేది.
ఎలాంటి రందీ లేకుండా మురిపెంగా చేసుకున్న వ్యవసాయం ప్రజాపాలనలో గుడిబండగా మారింది. విత్తనాలు, ఎరువుల నుంచి మొదలు కరెంట్ కష్టాలను తట్టుకొని చివరకు పంట అమ్ముకునే వరకు కూడా అరిగోసలే. అన్ని అంతో ఇంతో బాగున్నప్పుడే వ్యవసాయం చేయడం కష్టమైన పరిస్థితుల్లో.. ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు, నకిలీ ఎరువులు, కరెంట్ కష్టాలు,పెట్టుబడులకు డబ్బులు, చివరకు పంట విక్రయాలకు కష్టాలు ఉండనే ఉన్నాయి. ఇన్ని అష్టకష్టాల నేపథ్యంలో రైతులు ఏ మేర నెగ్గుకొస్తారన్నదే ప్రశ్న.
2026 యాసంగిలో పంటలు సాగుచేసిన మొక్కజొ న్న, వరి రైతులకు తరుగు కన్నీళ్లు తెప్పించింది. మక్కలను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు, కల్లా లు, గోదాం వద్ద రోజుల తరబడి ఎదురుచూశారు. గన్నీ బాగుల కోసం ఆకలిమరిచి క్యూలైన్లో నిలబడ్డారు. చచ్చి చెడి మక్కలను అమ్ముకుంటే పట్టి ఇచ్చిన తర్వాత కూడా తరుగుపేర కోత పెట్టారు. నాగర్కర్నూ ల్ నియోజకవర్గంలో మరో పెద్ద స్కామే నడించింది. గన్నీ బ్యాగులు, హామాలీ, ట్రాన్స్పోర్ట్ చార్జీలంటూ రైతుల నుంచి బస్తాకు రూ.70 వసూలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒక్కటంటే ఒక్కటి కాదు..
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగిలో ఐకేపీ, పీఏసీసీఎస్, మెప్మా, వ్యవసాయ మార్కెట్లు 200 కేంద్రాలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేసిం ది. 20,865 మంది రైతుల నుంచి 1,20,990లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో సన్నరకం 24,980 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 96,009 మెట్రిక్ టన్నుల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. రైతుల నుంచి సేకరించిన వరిధాన్యం మిల్లుల వద్దకు తీసుకుపోయినప్పుడే..అసలు కథ ప్రారంభమవుతుంది. వడ్లు నా ణ్యతగా లేవని, తాలు ఉందని తరుగు పేరిట క్వింటా కు సరాసరి 8 నుంచి 10 కిలోల తరుగుతీశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా తరుగుతీయడం ఆపలేదు. తరుగుతీయడానికి ఒప్పుకోకుంటుంటే వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరించారు. గత్యంతరం లేక కన్నీళ్లు దిగమింగుకుంటూ వడ్లను అ మ్ముకున్నారు. ఇందతా రహస్యంగా జరిగింది కాదు..
తరుగుతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి తాము విక్రయించిన సన్నాలకు బోనస్ ఇవ్వడానికి ప్రభు త్వం మొండి చేయి చూపించింది. యాసంగి బోనస్ విషయానికి వస్తే.. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన రైతుల నుంచి ప్రభుత్వం 24,980 మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి రూ.12కోట్ల 49లక్షల బోనస్ రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉంది. ఇప్పటి వరకు బోనస్ విషయమై ఏ విషయం చెప్పడం లేదు.
ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో తగ్గడంతో గణనీయంగా సాగు తగ్గిపోయింది.2025-26 సంవత్సరంలో 3లక్షల 9వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తే ఈ సంవత్సరం 2 లక్షల ఎకరాల వరకు మాత్రమే వచ్చింది. వరి విషయానికి వస్తే.. గతేడాది 1.80లక్షల ఎకరాల్లో సాగు చేస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 10వేల ఎకరాలు మించలేదు. వర్షాభావ ప్రభావంతో పంటల సాగుకే మాత్రమే ఇబ్బంది కాకుండా పాడి, పౌల్ట్రీ, కూరగాయల సాగు, తోటల పెంపకం తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడనున్నది.
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగిలో మొక్కజొన్నను భారీస్థాయిలో సాగుచేశారు. రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా…కొనుగోళ్లలో తీవ్ర ఇబ్బందుల తలెత్తాయి. మార్క్ఫెడ్ జిల్లా వ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1.84లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేశారు. ఇందులో కూడా రైతులను తీవ్రంగా మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గన్నీ బ్యాగులు, హామాలీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల పేరిట బస్తాకు రూ.70 వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు రైతులు మక్కలు తూకం వేసి రసీదు ఇచ్చిన తర్వాత తరుగు తీసి బిల్లు చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తరుగు పేరిట క్వింటాకు 8 నుంచి 10 కిలోల చొప్పున జిల్లా మొత్తంగా 1,20,990లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు 12వేల మెట్రిక్ టన్నుల వడ్లను తీసినట్లు లెక్కలు చెబుతున్నాయి.1,20,990 మెట్రిక్ టన్నుల వరిధాన్యానికి రూ.290 కోట్లు రైతుల ఖాతాల్లో జమఅయ్యాయి. 12వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం తరుగుతీశారనే వార్తల నేపథ్యంలో తరుగు ధాన్యాన్ని డబ్బు రూపకంగా లెక్కిస్తే రూ.28 కోట్లుగా లెక్కలు తేలుస్తున్నాయి. తలా పాపం తిలా పిడికెడు అన్నట్లు రైతులకు చెందిన తరుగు సొమ్ము వాటాలుగా జేబుల్లోకి చేరిపోయాయని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
ఎల్నినో ప్రభావం వర్షకాలంపై పడింది. సాధారణ వర్షాలు కూడా నమోదు కావడం లేదు.ఇప్పటి వరకు 168.2 మి.మీ. సాధారణ వర్షం కురవాల్సి ఉండగా కేవలం146 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. గతేడాది ఇదే సమయానికి 221 మి.మీ. వర్షం కురిసింది. సమృద్ధిగా వర్షం లేకపోవడంతో పత్తి విత్తనాలు రెండు మూడుసార్లు విత్తుకునే దుస్థితి వచ్చింది. వర్షాలు తక్కువ ఉంటాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ప్రత్యమ్నాయ పంటలపై అధికారులు రైతులను చైతన్యం చేయలేదు. దీంతో ఏ పంటలు సాగుచేయాలనే మీమాంసలో రైతులు ఉన్నారు. దీనికి తోడు డీఏపీ తదితర ఎరువుల కొరత కూడా చాలా ఉంది. నకిలీ ఎరువులు గ్రామాల్లోకి వచ్చి రైతులను నట్టేట ముంచు తున్నాయి.