హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి.. సహజ ఎరువుల వాడకాన్ని పెంచాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. తద్వారా భూసారాన్ని కాపాడడంతో పాటు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గించుకోవచ్చని అన్నారు. ‘ఎరువుల యాజమాన్యం-పచ్చిరొట్ట ఎరువుల వాడకం’ అనే అంశంపై బుధవారం టీ-శాట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడారు. గతంలో రైతులంతా కోడి, పశువులు, గొర్రెల ఎరువులను ఉపయోగించి మంచి పంటలు పండించే వారని, కానీ ఇప్పుడు రసాయన ఎరువుల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. పచ్చిరొట్ట.. రసాయన ఎరువులకు మంచి ప్రత్యామ్నాయమని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా పదేపదే ఇదే విషయాన్ని చెప్తున్నారని తెలిపారు.