హైదరాబాద్ : నగరంలోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈ నెల 6వ తేదీన జరగనుంది. రెగ్యులర్ రిక్ర్యూట్(ఆర్ఆర్) బ్యాచ్కు చెందిన 72 మంది, 144 మంది ఐపీఎస్ ప్రొబెషనరీస్, 34 ఫారిన్ ఆఫీసర్ ట్రైనీస్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొననున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
లాల్ బహదూర్ శాస్త్రీ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 15 వారాల ఫౌండేషన్ కోర్సు పూర్తి అనంతరం డిసెంబర్ 2019లో 178 మంది ట్రైనీలు అకాడమీలో చేరినట్లు ఎస్వీపీ ఎన్పీఏ డైరక్టర్ అతుల్ కర్వాల్ తెలిపారు. 59 వారాల శిక్షణను రెండు దశల్లో పూర్తిచేసినట్లుగా చెప్పారు. దీంతో పాటు 28 వారాల జిల్లా ప్రాక్టికల్ ట్రైనింగ్ను పూర్తిచేసినట్లు వెల్లడించారు.
ఇండోర్, అవుట్ డోర్ సబ్జెక్ట్ల్లో అన్ని రకాల శిక్షణను పూర్తి చేసుకున్నారన్నారు. గ్రేహౌండ్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్పోలీస్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్తో ట్రైనీస్ను శిక్షణ నిమిత్తం అనుసంధానించినట్లు వివరించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో అంతర్గత రక్షణ సవాళ్లపై కూడా ట్రైనీస్ శిక్షణ పొందారన్నారు. ఈ ఏడాది పాసింగ్ అవుట్ పరేడ్లో 16 శాతం మంది మహిళా ఐపీఎస్ అధికారులు పాల్గొంటున్నారు.