హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళ, బుధవారాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, గురు, శుక్ర, శనివారాల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్కు పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 135, ఇంజినీరింగ్కు 166 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఫొటో గుర్తింపు కార్డుగా కాలేజీ ఐడీకార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, పాన్కార్డు, ఓటర్ ఐడీకార్డును.. ఏదైనా ఒకటి వెంట తీసుకెళ్లాలి. ప్రశ్నలు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటాయి. పరీక్షా కేంద్రానికి 90 నిమిషాల ముందే చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.
వీడియోగైడ్ విడుదల: ఎప్సెట్ పరీక్షలను సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. సీబీటీపై అవగాహన కోసం జేఎన్టీయూ అధికారులు వీడియో గైడ్ను వెబ్సైట్లో విడుదల చేశారు. ఎనిమిది నిమిషాలకుపైగా వ్యవధి గల ఈ వీడియోను తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లోనూ రూపొందించారు.