NEET UG | ఆసిఫాబాద్ టౌన్, మే 6 : దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్ష సజావుగా జరిగినప్పటికీ, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మాడల్ స్కూల్ సెంటర్లో గందరగోళం నెలకొన్నది. నీట్ ప్రశ్నపత్రం తారుమారుకావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నది. పరీక్షాకేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం… పరీక్ష రాసిన 299 మంది విద్యార్థులకు శాపంగా మారింది. నీట్ పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ పేపర్లను రెండు సెట్లుగా రూపొందించారు. ఒక సెట్ పేపర్ ఎస్బీఐ బ్యాంకులో, మరొక సెట్ కెనరా బ్యాంక్లో భద్రపరిచి ఉంచారు. ఆదివారం ఉదయం సెంటర్ కో ఆర్డినేటర్ నరేందర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పంపిన ఎస్బీఐ నుంచి తెచ్చిన పేపర్ సెట్ కాకుండా కెనరా బ్యాంక్ నుంచి తెచ్చిన పేపర్ సెట్ను విద్యార్థులకు ఇచ్చారు. దేశవ్యాప్తంగా బార్ కోడ్ కలిగిన GRIDU సెట్ నిర్వహించగా, ఆసిఫాబాద్లో మాత్రం బార్ కోడ్ లేని NAGNU సెట్ నిర్వహించారు. దీంతో ఏండ్ల తరబడి కష్టపడి చదివిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము రాసిన పరీక్ష పేపర్లు దిద్దుతారా లేదా అని భయపడుతున్నారు. దీనిపై స్థానిక ఆర్డీవో లోకేశ్వరరావు సెంటర్కు వెళ్లి సిటీ కో ఆర్డినేటర్ నరేందర్ను విచారించారు. నీట్ ప్రశ్నాపత్రం తారుమారైన మాట వాస్తవమేనని, కో ఆర్డినేటర్ తప్పిదం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఈ విషయమై ఢిల్లీలోని ఎన్టీఏ డైరెక్టర్తో మాట్లాడామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆర్డీవో విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. విద్యార్థులు ఇచ్చిన వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తున్నానని తెలిపారు. అధికారిక కీ రెండు పేపర్లకు వస్తుందని వెల్లడించారు.
పరీక్ష పూర్తయిన తర్వాత మా కళాశాల గ్రూప్లో కీ పేపర్ పంపించారు. నేను రాసిన పరీక్ష పేపర్కు ఇచ్చిన ‘కీ’కి ఎలాంటి సంబంధం లేదు. అప్పుడే పేపర్ మారిందని మా స్నేహితులందరం గుర్తించాం. తక్షణమే సెంటర్ వద్దకు వెళ్లి నిర్వాహకులకు విషయం చెప్పాం. చాలా కష్టపడి రాశాం. అధికారులే మాకు న్యాయం చేయాలి.
– దాసరి దీపాన్వి, ఆసిఫాబాద్
మేము రాసిన ప్రశ్నాపత్రాన్ని అధికారిక ‘కీ’లో పెట్టాలి. మేము రాసిన పేపర్లను కూడా వ్యాల్యూ చేసి ఫలితాలు ఇవ్వాలి. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల మా భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకూడదు. అధికారులు చొరవ తీసుకొని న్యాయం చేయాలి.
– జే.హేమశ్రీ, సిర్పూర్టీ