Telangana | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో పగలు ఎండలు మండుతుంటే.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఆదివారం కురిసిన వర్షానికి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల ఐదు రోజులపాటు అకడకడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వడగాలులు వీచాయి. మరికొన్ని చోట్ల అకడకడా వర్షాలు కురిశాయి. మంగళవారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అకడకడా ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. దీంతో వివిధ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి తెలిపారు.
నెలరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో అట్టుడికిన వివిధ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో కురిసిన వానతో వాతావరణం కాస్త చల్లబడింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురిసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో 6.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 4.7 సెంటీమీటర్ల వర్షం పడింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్లో 177.5 మి.మీ, నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో 10.8 మి.మీ, కల్వకుర్తి మండలం ఎల్లికల్లో 3.8 మి.మీ, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో 3.5 మి.మీ, నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం సింగరాజ్పల్లిలో 3.3 మి.మీ, ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలో 2.0 మి.మీ వర్షపాతం నమోదైనట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రాగల ఐదురోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో సోమవారం కూడా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. జగిత్యాల జిల్లా గుల్లకోట, అల్లీపూర్లో 46.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4, సుగ్లాంపల్లి, జగిత్యాల జిల్లా కోల్వాయిలో46.3, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 46.2, జగిత్యాల జిల్లా గోదూరులో 46.1, కుమ్రంభీం జిల్లా తిర్యాణీ, మంచిర్యాల జిల్లా నస్పూర్లో 46, వెల్గనూర్లో 45.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొన్నది.