Revanth Reddy | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతలకు పిచ్చిపట్టినట్టున్నదని, అందుకే 24 గంటల ఉచిత విద్యుత్తుపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని జాతీయ రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్తుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం కరెక్ట్ కాదని స్పష్టంచేశారు. ఇదే జరిగితే రైతులను మళ్లీ నరకకూపంలోకి నెట్టడమేనని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డికి పిచ్చిపట్టినట్టుంది ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు హల్చల్ చే స్తున్నారు. ఎవరో ఒకరిద్దరు పార్టీలోకి రాగానే ఏదో జరిగిపోయినట్టు భ్రమపడుతున్నారు. వాళ్లు అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నరు. విద్యుత్తుపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ. రేవంత్రెడ్డికి పిచ్చిపట్టినట్టు ఉన్నది. అందుకే ఆలాంటి వ్యాఖ్యలు చేశారు. అవన్నీ పిచ్చి మాటలే.
రేవంత్ ఒక్కడే నాటి పరిస్థితులను కోరుకుంటున్నారు
ఉమ్మడి ఏపీలో నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రే వ్యవసాయానికి ఏడు గంటల కరెంట్ ఇస్తామని ప్రకటిస్తే.. రేవంత్రెడ్డి మూడు గంటలే చాలు అనడం అశ్చర్యంగా ఉన్నది. అప్పుడు పగలు మూడు గంటలు, రాత్రి నాలుగు గంటల కరెంట్ ఇచ్చేవాళ్లు. రాత్రి కరెంట్తో ఏటా సుమారు 600 మంది రైతులు కరెంట్ షాక్తో చనిపోయేవారు. అలాంటి పరిస్థితి మళ్లీ రావాలని ఎవరూ కోరుకోరు. కానీ రేవంత్రెడ్డి ఒక్కరే ఈ పరిస్థితులను కోరుకుంటున్నట్టు ఉన్నారు.
రైతులు ఇష్టమొచ్చినప్పుడు వాడుకుంటరు
24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. రైతులకు ఇష్టమొచ్చినప్పుడు, తమ పంటల అవసరాలకు అనుగుణంగా విద్యుత్తును వాడుకుంటరు. రైతులందరూ 24 గంటలపాటు విద్యుత్తును ఉపయోగించుకోరు. ఒకవేళ వినియోగించుకుంటున్నారంటే ఆ స్థాయిలో పంటలు పండిస్తున్నట్టే కదా. పంటలు ఎక్కువ పండితే రైతులకు లాభమే కదా. రైతుకు లాభం చేసేందుకు ప్రభుత్వాలు ఏమి చేసినా పర్వాలేదు.
మళ్లీ నాటి పరిస్థితులు రావొద్దు
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం రైతులు ఎంత గోస పడ్డరో కండ్లారా చూశాం. విద్యుత్తు ఉద్యమంలో బషీర్బాగ్లో నాటి చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పుల ఘటన ఇంకా కండ్ల ముందు మెదులుతూనే ఉన్నది. ఈ కాల్పుల్లో నాకు కూడా గాయాలయ్యా యి. ఆనాటి కష్టాలను ఈ ప్రభుత్వం తీర్చింది. నాటికీ నేటికీ చాలా తేడా ఉన్నది. మూడు గంటల కరెంట్ అని, ఇంకేదో అని మళ్లీ నాటి గడ్డు పరిస్థితులను మాత్రం తీసుకురావొద్దు.
అదే నిజమైతే..
ఒకవేళ రేవంత్రెడ్డి చెప్తున్న మూడు గంటల కరెంటే నిజమైతే రాష్ట్రంలో రైతులను మళ్లీ నరక కూపంలోకి నెట్టేసినట్టే అవుతుంది. వ్యవసాయరంగం ఆగమైతది. రాష్ట్రంలో 60 శాతం సాగు భూమి బోర్లు, బావుల కిందనే ఉన్నది. 24 గంటల కరెంట్ లేకపోతే ఈ భూములన్నీ మళ్లీ పడావుగా మారడం ఖాయం.
24 గంటల ఉచిత విద్యుత్తు గొప్ప విషయం
24 గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇవ్వడమనేది నిజంగా గొప్ప విషయం. రైతులకు కష్టం రావొద్దని కరెంట్ను కొనుక్కొచ్చి మరీ ఇస్తున్నారు. అప్పులు చేసి తెస్తున్నారా? ఇంకేం చేస్తున్నారనేది ఇక్కడ అవసరం లేదు. రైతులు రెండు పంటలు పండించేందుకు అవసరమైన కరెంట్ను అవసరమైన సమయంలో ఇస్తున్నదా? లేదా? అనేదే ముఖ్యం. ఇది సులభమైనదే అయితే గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయి.