తెలంగాణ చౌక్, డిసెంబర్ 12: కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదని, ఆ వ్యవస్థ ద్వారా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పాలనలో జోక్యం చేసుకుంటున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో నిరుద్యోగం పెరిగిందని, లక్షలాది పరిశ్రమలు మూతపడుతున్నాయని విమర్శించారు. లాభసాటి ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు బీజేపీ ధారాదత్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆప్ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని కుట్ర చేశారని, ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల నుంచి రూ.వంద కోట్ల వరకు ఎర చూపారని ఆరోపించారు. తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనాలనుకున్న కుట్రలు బయట పడ్డాయని, అందులో సాక్షులు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నదన్నారు. బీజేపీ దేశంలో ఎనిమిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టిందని విమర్శించారు.