హైదరాబాద్ : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం అయిన జైళ్లను బాగుచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) అన్నారు. హైదరాబాద్లోని మగ్ధుమ్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైడ్రా(Hydra) చర్యల వల్ల బడా బాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందా లేదా వారి ఒత్తిడితో రేవంత్ రెడ్డే(CM Revanth Reddy) జైలుకు(Jail) వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రధానిగా మోదీ అయ్యాక నేను సన్యాసిని.. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు అన్నారు.
అప్పులు ఎగ్గొట్టిన వాళ్లలో ఒక్క విజయ్ మాల్య తప్ప మిగితా అందరూ గుజరాత్ వారేనని గుర్తు చేశారు.మోదీ దయతో అదానీ పెరిగారు. ఆయన సొంతంగా ఎదగలేదన్నారు. సెబీ కూడా అదానీకి దాసోహం అయ్యిందని విమర్శించారు. పదేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు దేశ వ్యాప్తంగా నిరసనలకు సీపీఐ పిలుపు ఇచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ మోదీని మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.ట్రాఫిక్ నుంచి హైదరాబాద్ బయటపడాల్సిన అవసరం ఉందన్నారు.
హైడ్రా పని తీరు అభినందనీయమ న్నారు. ప్రభుత్వ భూమి నోటరీ పద్ధతుల్లో కూడా కొందరు అమ్మకాలు చేశారు.ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి.. చెరువు నిర్మాణం చేయా లన్నారు. రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నాడు. మధ్యలో ఆపేస్తే.. పులి తినేస్తుందని హెచ్చరించారు. నాగార్జున బఫర్ జోన్లో కాదు ఎఫ్టీఎల్లోనే నిర్మాణం చేశాడన్నారు. ఎంఐఎం చెబుతున్నట్లు ప్రభుత్వ ఆఫీస్ లు కూల్చేసే విషయంపై రేవంత్ రెడ్డి అఖిల పక్ష సమావేశం పెట్టాలన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వాటితో ప్రైవేటు నిర్మాణలు పోల్చడం తప్పన్నారు.