హైదరాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలోకి మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున చేరారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, తాలుకా ప్రెసిడెంట్లు, సర్పంచ్లు, నగర సేవక్లు, జడ్పీ మాజీ సభ్యులు, మాజీ చైర్మన్లు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాందేడ్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో నాందేడ్తోపాటు చంద్రాపూర్, పర్భని, లాతూర్ తదితర జిల్లాల నుంచి తరలివచ్చిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
ప్రముఖ నాయకుడు ప్రకాశ్ పోరే, మాజీ ఎమ్మెల్యే దీపక్ ఆత్రం, రాజు తొడిశం, మాణిక్ కదంలతోపాటు చంద్రాపూర్ ఎమ్మెల్యే దీపక్, థానే మాజీ ఎమ్మెల్యే దిగంబర్, ఉద్గిల్ మాజీ ఎమ్మెల్యే మనోహర్, షెత్కారి సంఘటన్ అధ్యక్షుడు నానా బచ్చ, దైనిక్ పత్రిక ఎడిటర్ రాజన్జీ, కిసాన్ అఘాడి ప్రెసిండెంట్ షాంబాజీ బ్రిగేడ్, జడ్పీటీసీలు జయసుధ, సంజయ్, దారుజీ, నగర సమితి సభ్యురాలు సుష్మిత, బండూజీ, సర్పంచ్ సూరజ్, దివాకర్, ఉమేశ్, భవానీ, మల్లికార్జున్, శంకర్, దుసర్వార్, ప్రముఖ కవి జ్ఞానేశ్ వాకుడ్కర్, న్యాయవాది పండరీనాథ్, దస్తగిరి, ఉమేశ్పాటిల్, శంకర్ పాటిల్, సహ్రిబ్రావ్ చౌహాన్, మాజీ జడ్పీటీసీ సహేబ్రావు, ధన్లాల్ పవార్తోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సర్పంచ్లు కేసీఆర్ సమక్షంలో చేరారు. బీజేపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ ఎంపీలు,మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సరిహద్దు గ్రామాలకు చెందిన దాదాపు 40 గ్రామాలకు చెందిన సర్పంచ్లు బీఆర్ఎస్లో చేరారు.
త్వరలో మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటనున్నది. అహేరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దీపక్ దాదా ఆత్రం నాయకత్వంలో గడ్చిరోలి జిల్లా ఈటపల్లి , అహేరి, సిరోంచ, ముల్చెర తాలూకాల నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఆదివాసీ విద్యార్థి సంఘటన్ తాలూకా అధ్యక్షుడు బన్నయ్య జంగం, సిరోంచా తాలూకా మాజీ చైర్పర్సన్లు మండ శంకర్, మల్లికా అర్జున్, మాజీ సర్పంచ్ రవి సల్లాం, ప్రముఖ న్యాయవాది జయరాం కొండగొర్ల, దిలీప్ గంజ్వార్, అగర్వాల్ భయ్య, పిలిప్స్, లాలూజీ కార్పెట్, ప్రమోద్ ఆత్రం,మనీష్ మర్టకర్, రమేశ్ సిదమ్, నందు మాధవి, కమల్ బాలా తదితర ప్రముఖులు ఉన్నారు.