నల్లగొండ, జూన్ 13: ఉద్యమాల జిల్లా నల్లగొండ.. ఉద్యోగాల ఖిల్లా కావాలని ఉద్యోగార్థులకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష్యం దృఢంగా ఉంటే విజయం బానిస అవుతుందని వారికి ఉద్బోధించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎలా చదవాలి? ఒత్తిడిని ఎలా జయించాలి? తదితర విషయాలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సహకారంతో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ వల్లవరపు బాల లత, వేప అకాడమీ డైరెక్టర్ సీఏ వేపతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లను యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 83 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థతో 98 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని అన్నారు. ఈ సందర్భంగా 40 నిమిషాల పాటు సాగిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఉద్యోగార్థుల సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు.
సదస్సులో నమస్తే తెలంగాణ నిపుణ ఇన్చార్జి వేంకటేశ్వర శర్మ, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్ రెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేందర్, ఈవెంట్స్ మేనేజర్ గణేశ్, ఏడీవీటీ మేనేజర్ శివ కుమార్, సర్క్యులేషన్ మేనేజర్ మారగోని మల్సూర్ గౌడ్, తెలంగాణ టుడే స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, భవిత ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.