హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తనున్నట్లు టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున నామా నాగేశ్వర్రావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని తెలిపారు.
గతంలోమాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయొద్దని స్పష్టం చేశామన్నారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. తెలంగాణలో పంట మొత్తం కొనాలని, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. పంట కొనుగోళ్లపై రెండు నెలల్లో నాలుగైదు సార్లు సీఎం కేసీఆర్, మంత్రులు చర్చించారన్న ఆయన.. కేంద్రం చివరికి చేతులెత్తేసి ధాన్యం కొనుగోలు చెబుతుందన్నారు.
యాసంగి పంట అసలే కొనం, ఎంత కొంటామో కూడా చెప్పమని అంటున్నారని.. అఖిలపక్ష భేటీకి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. వ్యవసాయ బిల్లులు రద్దుతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వామినాథన్ సిఫారసులు అమలు చేసి మద్దతు ధర కల్పించాలని భేటీలో డిమాండ్ చేశామన్నారు. అలాగే రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, మరణించిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3లక్షల సాయం ప్రకటించారని.. ఇదే అంశంలో కేంద్రం కూడా ముందుకు రావాలని డిమాండ్ చేశామని.. టీఆర్ఎస్ ప్రతిపాదనకు అన్ని పార్టీల నేతలు మద్దతు తెలిపారన్నారు.
ఓ పక్క వ్యవసాయ చట్టాల బిల్లులను వెనక్కి తీసుకుంటూనే.. మళ్లీ విద్యుత్ బిల్లు పెట్టారని, దేశంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనన్నారు. కృష్ణా జలాల అంశంలో ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బిల్లు అని యూపీకి సంబంధించిన అంశాల మీద బిల్లు పెట్టారని.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన ఎలాంటి స్పందన లేదన్నారు. రైతుల అంశాలపై సభ లోపల, బయట పోరాడుతామని స్పష్టం చేశారు.