Nallagonda | సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఉంటారని, 12 నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండానే ఎగురుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో సమస్యలు సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన విరుచుకుపడ్డారు. ఆ సమస్యలు కాస్తా తెలంగాణాకు శాపంగా మారాయన్నారు. ఆ గోస నుండి బయటపడేందుకే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు.
హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని.. మఠంపల్లి మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్రావు, మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.
స్థానిక శాససభ్యులు శానంపుడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. 2014కు పూర్వం కాంగ్రెస్ పార్టీ సమస్యలు సృష్టిస్తే 2014 తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని ఆయన తెలిపారు. గులాబీ నీడన ప్రయోజనం పొందిన వారిలో విపక్ష కాంగ్రెస్, బిజెపి నేతలు ఉన్నారని ఆయన వెల్లడించారు. మాజీ మంత్రి జానారెడ్డి మొదలు కొని ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, బిజెపి నేత బండి సంజయ్.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్దిదారులేనన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఎడారిగా మార్చిన పాపం 30 ఏండ్లుగా పాలించిన కాంగ్రెస్ నేతలది కాదా అని ఆయన ప్రశ్నించారు. అటువంటి దుర్భర పాలన నుండి విముక్తి చేసినందుకే ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. అందుకే జిల్లాలోని 12కు 12 స్థానాల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించిందన్నారు. ఇప్పటికీ, ఎప్పటికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే పయనిస్తారని ఆయన స్పష్టం చేశారు. రేపటి ఎన్నికల్లోనూ 12కు 12 స్థానాల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగించబోతుందని మంత్రి జగదీవ్ రెడ్డి తెలిపారు.