నీలగిరి, నవంబర్ 7: తొమ్మిది మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసు వివరాలను సోమవారం నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియాకు వెల్లడించారు. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది సెప్టెంబర్ 7న ఓ ప్రైవేటు బస్సులో రూ.30 లక్షల నగదుతో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా నార్కట్పల్లి శివారులో టిఫిన్ తినేందుకు దిగాడు. తర్వాత అదే బస్సులో హైదరాబాద్కు చేరుకున్నాడు. అక్కడ బ్యాగ్ చూసుకోగా డబ్బులు లేవు. దాంతో బాధితుడు హైదరాబాద్లోని హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి చిట్యాల పోలీసులకు కేసు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బాధితుడు టిఫిన్ చేసిన హోటల్ పరిసరాలు, హైవేపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం నార్కట్పల్లి కనకదుర్గ హోటల్ సమీపంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడంతో వారిని అదుపులోకి తీసుకొన్నారు. వారు ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన తాజ్, సర్ఫ్రాజ్గా గుర్తించారు. ట్రావెల్ చేస్తున్న బస్సుల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకొన్నారు.