Nagarjuna Sagar | నందికొండ : ఆంధ్రా ఇరిగేషన్( Andhra Irrigation ) అధికారులపై తెలంగాణ ఇరిగేషన్( Telangana Irrigation ) అధికారులు దౌర్జన్యం చేయలేదని, కేవలం నీటిని నిలిపివేయమని మాత్రమే చెప్పామని నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) ప్రాజెక్టు ఈఈ మల్లికార్జున గురువారం స్పష్టం చేశారు. ఆంధ్రా అధికారులపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు దౌర్జన్యం చేసినట్లు ఆయా పత్రికల్లో ప్రచురితమైన వార్తలు అవాస్తవమని సాగర్ ఈఈ పేర్కొన్నారు.
కృష్ణా రివర్ బోర్డు( Krishna River Board ) ఆంధ్రాకు 132 టీఎంసీలు కేటాయించగా, జూన్ 1, 2022 నుంచి ఇప్పటి వరకు 184.692 టీఎంసీల నీటిని కుడికాల్వ ద్వారా వినియోగించుకున్నారని ఈఈ మల్లికార్జున తెలిపారు. కుడికాల్వ( Right Canal ) ద్వారా అధికంగా నీటిని వాడుకున్న నేపథ్యంలో ప్రస్తుతం కృష్ణా నది( Krishna River )లో నీటి నిల్వలు తగ్గుతున్నందున ఆంధ్ర పవర్ హౌస్ ద్వారా కొనసాగిస్తున్న నీటి వినియోగాన్ని నిలుపుదల చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై రైట్ బ్యాంక్లో ఉన్న పవర్ హౌస్ దగ్గరకు వెళ్లి ఆంధ్రా ఈఈ శ్రీహరితో చర్చించామని సాగర్ ఈఈ మల్లికార్జున స్పష్టం చేశారు.
తెలంగాణ ఇరిగేషన్ అధికారుల తమపై దౌర్జన్యం చేశారని ఆంధ్రా అధికారులు ప్రచారం చేశారని, కొన్ని ఏపీ పత్రికల్లో ఈ వార్తలు ప్రచురితమయ్యాయని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కుడికాల్వ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి అధికంగా కొనసాగుతున్న నీటి వినియోగాన్ని కృష్ణా రివర్ బోర్డుకు తెలిపామన్నారు. తమ అభ్యర్థనను స్వీకరించిన కృష్ణా రివర్ బోర్డు తక్షణమే స్పందించి.. ఈ నెల 15వ తేదీన కుడికాల్వకు జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటి వినియోగాన్ని ఆపాలని ఆంధ్రా అధికారులను ఆదేశించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కుడికాల్వకు నీటి విడుదలను ఆంధ్ర అధికారులు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నీటి నిల్వ 536 అడుగుల వద్ద 181 టీఎంసీల మేర నీరు నిల్వ ఉందన్నారు. 510 అడుగుల దిగువకు చేరుకుంటే తెలంగాణలో తాగునీటికి ఇబ్బంది పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా కుడికాల్వ ద్వారా నీటి వినియోగాన్ని నిలుపుదల చేయాలని ఆంధ్ర అధికారులకు సూచించామని పేర్కొన్నారు.