Nagarjuna Sagar | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ)/నందికొండ: నాగార్జునసాగర్ డ్యామ్పై నవంబర్ 28కి ముందున్న రీతిలో యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించాలని సూచించింది. అందుకు ఇరు రాష్ర్టాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ నెల 29న అర్ధరాత్రి 100 మంది సాయుధ పోలీసులను ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా దింపి నాగార్జునసాగర్ డ్యామ్ను అక్రమించింది. 13వ గేట్ వద్ద ముళ్ల కంచె ఏర్పాటు చేసింది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసింది. కుడికాలువ గేట్లను ఎత్తి 5,000 క్యుసెక్కుల నీటిని తరలించుకుపోవడం ప్రారంభించింది. ఏపీ చర్యలను తీవ్రంగా ఆక్షేపించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే విషయాన్ని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది. తక్షణమే జోక్యం చేసుకుని దౌర్జన్యపూరితంగా ఏపీ చేపట్టిన నీటి తరలింపును ఆపాలని, డ్యామ్ ఆక్రమణను తొలగించి పూర్వపుస్థితిని పునరుద్ధరించాలని, డ్యామ్ కంట్రోల్ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో బోర్డు చైర్మన్ ఈ విషయాన్ని వెంటనే కేంద్ర జలశక్తిశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదం విషయంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశనం చేయాలని కేంద్రాన్ని బోర్డు కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్కుమార్ భల్లా.. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి, కేంద్ర జల సంఘం, కేఆర్ఎంబీ అధికారులు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో శుక్రవారం ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. నవంబర్ 29న రాత్రి ఆంధ్రప్రదేశ్కు చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు నాగార్జునసాగర్ డ్యామ్పైకి వచ్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతోపాటు 5, 7 గేట్ల వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్లను తెరిచి దాదాపు 5 వేల క్యూసెకుల నీటిని విడుదల చేశారని ఆక్షేపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వ చర్య దుస్సాహసమైనదని, తమ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించిందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గత రెండేండ్లుగా ఏపీ ప్రభుత్వం ఈ విధమైన అతిక్రమణలకు పాల్పడటం ఇది రెండోసారి అని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వ చర్య వల్ల హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోని రెండు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుంచి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్-కోను కొనసాగించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.
ఇరు రాష్ర్టాలతో మాట్లాడిన అనంతరం కేంద్ర హోంశాఖ.. ఏపీ, తెలంగాణకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. నాగార్జునసాగర్ డ్యామ్పై గతంలో ఉన్న మాదిరిగానే స్టేటస్-కో కొనసాగించాలని ఆదేశించింది. అదేవిధంగా ఈ డ్యామ్ తాత్కాలికంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో ఉంటుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఆపరేషన్ ప్రొటోకాల్ అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, నీటి పారుదలశాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్కే జైన్, ఐజీ షానవాజ్కాశీం, నీటిపారుదల శాఖ సలహాదారు మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వీడియోకాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయం మేరకు డ్యామ్ పర్యవేక్షణకు కేంద్ర హోంశాఖ రెండు ప్లాటూన్ల సీఆర్పీఎఫ్ బలగాలను తరలించింది.
నాగార్జునసాగర్ డ్యామ్పైకి అక్రమంగా ప్రవేశించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఏపీ అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు శుక్రవారం చర్చలు జరిపారు. శుక్రవారం ఉదయం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ హరిరామ్, సీఈలు హమీద్ఖాన్, ధర్మానాయక్, రమేశ్బాబు డ్యామ్ వద్దకు చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించి ఏపీ అధికారులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో శ్రీశైలం డ్యామ్ నిర్వాహణను ఏపీ ప్రభుత్వం, నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వాహణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించిన విషయాన్ని తెలంగాణ అధికారులు గుర్తుచేశారు. కేఆర్ఎంబీ సూచనల ప్రకారం ఏపీకి రావలసిన నీటిని విడుదల చేస్తున్నామని, అక్టోబర్లో 5 టీఎంసీల నీటికి బదులు 5.10 టీఎంసీలను విడుదల చేశామని, జనవరిలో మరో 5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉన్నదని తెలిపారు. నవంబర్లో కుడి కాల్వకు నీటి విడుదలపై ఏపీ అధికారుల నుంచి ఇండెంట్ లేదని, కావాలనే డ్యామ్పై ఉద్రిక్త వాతావరణం నెలకొల్పి నీటిని విడుదల చేసుకున్నారని చెప్పారు.
నాగార్జునసాగర్ డ్యామ్పై ఉద్రిక్త వాతావరణం సృష్టించి, డ్యామ్ పోలీస్ సిబ్బందిపై దాడి చేసి, సీసీ కెమెరాలు, ఫోన్లను ధ్వంసం చేసిన ఏపీ అధికారులు, పోలీసులపై తెలంగాణలోని నందికొండ పైలాన్కాలనీ పోలీస్స్టేషన్లో తెలంగాణ డ్యామ్ ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టారు.
సాగర్ కుడికాల్వ నుంచి నీటి విడుదలను వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ కార్యదర్శికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. గతంలో త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి 15 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్కు విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ మధ్య 5 టీఎంసీలను విడుదల చేశామని పేర్కొన్నది. రానున్న జనవరి 8 నుంచి 18 వరకు మరో 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుంచి18వ తేదీ వరకు మూడో విడతగా 5 టీఎంసీలను విడుదల చేయాల్సి ఉన్నదని వెల్లడించింది. అయితే నవంబర్, డిసెంబర్లో నీటి విడుదల కోసం ఏపీ నుంచి కేఆర్ఎంబీ ఎలాంటి ఇండెంట్ను అందుకోలేదని ఆ లేఖలో స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కుడి కాలువ నుంచి నీటి విడుదలను వెంటనే నిలిపివేయాలని ఏపీని ఆదేశించింది. అయితే ఆంధ్ర ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోకుండా నీటి విడుదలను కొనసాగిస్తున్నది.
నాగార్జునసాగర్ డ్యామ్పై గురువారం రాత్రి ప్రారంభమైన ఉద్రిక్త పరిస్థితులు శుక్రవారం కూడా కొనసాగాయి. ఏపీ అధికారులు పోలీస్ బలగాలతో గురువారం తెల్లవారుజామున డ్యామ్ గేట్లను పాడుచేశారు. డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి ఫోన్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డ్యామ్పైకి ప్రవేశించారు. డ్యామ్ 13వ గేటు వరకు తమదని పేర్కొంటూ అక్కడ ముళ్ల కంచె, బారికేడ్లు ఏర్పాటు చేసి డ్యామ్ పై ఉన్న రోడ్డును మూసివేశారు. అవతల ఏపీ పోలీసులు పహారా కాస్తూ 13వ గేటు అవతల ఉన్న కంట్రోల్ రూమ్కు తెలంగాణ అధికారులను, పోలీసులను పోకుండా అడ్డుకున్నారు. డ్యామ్ సగ భాగం తమదేనంటూ గురువారం బలవంతంగా కుడి కాల్వ గేట్లను తెరిచి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆంధ్ర అధికారులు, పోలీస్ బలగాలు నాగార్జునసాగర్ డ్యామ్పై ఉద్రిక్తత వాతావరణం సృష్టించడంతో పరిస్థితులను చక్కదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక, సివిల్, ఏఆర్, బెటాలియన్లతో పోలీస్ బలగాలను తెలంగాణ వైపు ఉన్న డ్యామ్ వద్ద మోహరించింది. వెయ్యి మంది పోలీసులు తెలంగాణ వైపు ఉన్న డ్యామ్ వద్ద పహారా కాస్తున్నారు.