సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలోని గడపగడపకూ తిరుగుతూ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. తమ ఓటుద్వారా ముఖ్యమంత్రికి సంపూర్ణ మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. సంస్థాన్ నారాయణపురంలోని గుజ్జ గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్న సీఎం కేసీఆర్ను మరవద్దని పింఛన్ దారులను కోరారు. సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతిగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలకు సీఎం కేసీఆర్తోనే మేలు జరుగుతుందన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతోనే మునుగోడుకు మంచి రోజులు వస్తాయని చెప్పారు. కూసుకుంట్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుజ్జ సర్పంచ్ మైళ్ల యాదవరెడ్డి, ఎంపీపీ గుత్తా ఉమాదేవి ప్రేమ్చందర్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగటి మల్లికార్జున్ రెడ్డి, ఎంపీటీసీ దోడ వినోద్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.