హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధికి సహకరించాలని ఇప్పటికే అనేకసార్లు కోరామని, ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తమకు నిరాశే ఎదురవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషికి తోడ్పాటు అందించేందుకు 2023-24 బడ్జెట్లో అయినా తగినన్ని నిధులు కేటాయించాలని విన్నవించారు. ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖకు బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. హైదరాబాద్, వరంగల్, ఇతర పురపాలికల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, లేదంటే హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.
పురపాలనలో తెలంగాణ బెస్ట్
తెలంగాణ రాష్ట్రంపై వివక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అదనంగా ఒక రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపినా రాష్ట్రంలో పురపాలికలతోపాటు అన్ని రంగాలు అద్భుత ప్రగతి సాగిస్తున్నాయని తెలిపారు. ఎంతో ముందుచూపు, దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన పాలనా సంసరణలు, విప్లవాత్మక కార్యక్రమాలతో పట్టణాలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, రివార్డులే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అవార్డులతో అయినా బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును మోదీ సరార్ గుర్తించిందని అన్నారు. తెలంగాణ జనాభాలో 47 శాతం పట్టణాల్లో నివసిస్తున్న నేపథ్యంలో వాటిని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందుకోసమే నూతన మున్సిపల్ చట్టం, నూతన భవన నిర్మాణ అనుమతుల చట్టం, ప్రతీ పట్టణం కచ్చితంగా ఖర్చు చేయాల్సిన 10 శాతం గ్రీన్ బడ్జెట్, టీఎస్బీపాస్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలను అమలుచేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో పురపాలికలను 68 నుంచి 142కు పెంచామని గుర్తుచేశారు.
ఇవీ మా ప్రతిపాదనలు
హైదరాబాద్లో మెట్రో రైలు ప్రజలకు అత్యంత అనువుగా మారింది. దానికి అనుసంధానంగా భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రోను కలుపాలని తలపెట్టాం. రూ.6,250 కోట్ల బడ్జెట్తో 31 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు వెంటనే అంగీకారం తెలిపి ఆర్థికంగా మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలి.
హైదరాబాద్ నగరంలో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కోసం దాదాపు రూ.3,050 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇందులో 15 శాతం మూలధన పెట్టుబడిగా రూ.450 కోట్లను కేంద్రం కేటాయించాలి.
హైదరాబాద్ మెట్రో రైల్ కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్లోని రూ.254 కోట్ల బకాయిలు ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ నిధులను ఈ బడ్జెట్లో అయినా కేటాయించాలి.
హైదరాబాద్తో సహా తెలంగాణలోని పురపాలికల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ వంటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.3,777 కోట్ల్లు ఖర్చవుతుంది. ఇందులో కనీసం 20 శాతం అంటే రూ.750 కోట్లను కేంద్రం కొత్త బడ్జెట్లో కేటాయించాలి.
హైదరాబాద్లో మురుగు నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా రూ.4,961 కోట్ల అంచనా వ్యయంతో 1,591ఎంఎల్డీ సామర్థ్యంతో 41 ఎస్టీపీలు నిర్మిస్తున్నాం. రూ.3,722 కోట్లతో 2,232 కిలోమీటర్ల మేర భారీ మురుగునీటి సరఫరా నెట్ వర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే రూ.8,684 కోట్లలో కనీసం మూడో వంతును స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం భరించి తెలంగాణకు మద్దతు ఇవ్వాలి.
వార్షిక యాక్షన్ ప్లాన్లో భాగంగా హైదరాబాద్ నగరంలో వరదలను అరికట్టే బృహత్తర లక్ష్యంతో చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం గతంలో రూ.240 కోట్లు అడిగాం. ఆ నిధులను ఈ బడ్జెట్లో ఇవ్వాలి.
హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.400 కోట్లు కేటాయించాలి.
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా హైదరాబాద్ నగరంలో చేపట్టిన సైవాక్, ఫె్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి మొదటి దశ పూర్తయింది. ఇంతటి భారీ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ బాండ్స్, రుణాల రూపంలో నిధులు సమకూర్చుకొంటున్నది. ఇప్పటిదాకా పూర్తయిన మొదటి దశ ఎస్ఆర్డీపీకి కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఒక రుపాయి కూడా అందలేదు. ఎస్ఆర్డీపీ రెండో దశకైనా భారీగా నిధులు ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక సిద్ధంగా ఉన్నది.
హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో భాగంగా చేపట్టబోతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వే (రూ.11,500 కోట్లు ), ఎస్ఆర్డీపీ రెండో దశ (14 వేల కోట్లు), డెవలప్మెంట్ ఆఫ్ ఎలివేటెడ్ కారిడార్స్ (రూ.9,000 కోట్లు) కోసం అవసరమయ్యే రూ.34,500 కోట్లలో కనీసం పది శాతం అంటే రూ.3,450 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించాలి.
హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ తగ్గింది. రూ.2,400 కోట్లతో చేపట్టే 104 లింక్ రోడ్ల నిర్మాణ వ్యయంలో మూడో వంతు (రూ.800 కోట్లు) కేంద్ర ప్రభుత్వం భరించాలి.
జాతీయ రహదారి 65 పై ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డిటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ సిద్ధంగా ఉన్నది. ఇందుకయ్యే రూ.500 కోట్ల వ్యయాన్ని వచ్చే కేంద్ర బడ్జెట్లో కేటాయించాలి.
తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి దేశంలో ఎకడా లేనివిధంగా తెలంగాణ శానిటేషన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు కేంద్రం రూ.100 కోట్ల సీడ్ ఫండింగ్ ఇవ్వాలి.
జీహెచ్ఎంసీ చేపట్టిన మూడో విడత మున్సిపల్ బాండ్స్ జారీకి కేంద్రం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలను విడుదల చేయాలి.
రాష్ట్ర నిధులతో హైదరాబాద్ అభివృద్ధి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను వేగంగా అమలు చేయడం కోసం పాలనాపరంగా పటిష్ఠ ఏర్పాట్లు చేశామని లేఖలో గుర్తుచేశారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ), వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ), కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రాజెక్ట్ (సీఆర్ఎంపీ), హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్), మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్), తెలంగాణ ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) వంటి సంస్థల ఏర్పాటుతోపాటు అనేక స్పెషల్ పర్పస్ వెహికిల్స్ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
వీటివల్ల ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు వేగంగా పూర్తికావడం వల్లే మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో వరుసగా ఆరోసారి అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని పేర్కొన్నారు. హరితహారంతో హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్సిటీగా అవార్డు లభించిందని తెలిపారు. మనదేశం నుంచి హైదరాబాద్ నగరానికి మాత్రమే ఈ గుర్తింపు దకిన విషయాన్ని గుర్తుచేశారు. దేశ గౌరవ ప్రతిష్ఠలను విశ్వ వేదికలపై సగర్వంగా నిలబెడుతున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉన్నదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పట్టణాల అభివృద్ధిపై వివిధ ప్రతిపాదనలు, విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని, కనీసం ఈ బడ్జెట్లో అయినా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.