Mulugu | ములుగు : ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక నామినేషన్ దాఖలు చేసిన రోజే ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బీఆర్ఎస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి భారీ సంఖ్యలో వలసలు వస్తుండడంతో ములుగు కాంగ్రెస్ నాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది.
ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ రావు, రాష్ట్ర రోడ్లు, భవనాల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ సమక్షంలో ఆమె పార్టీలో చేరగా, ములుగు ఎన్నికల ఇన్చార్జి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ.. 60 ఏళ్ల సుదీర్ఘ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీజీపీ మతం పేరుతో ప్రజల్లో విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటోందన్నారు. అన్ని వర్గాల సంక్షేమ పాలన కేవలం ఒక్క సీఎం కేసీఆర్కే సాధ్యమన్నారు. తెలంగాణలో సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు.
ధనలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఅర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలై బీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు. ఇప్పటివరకు సీతక్క చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేశ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు వలీబాబా, పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు కాకులమర్రి ప్రదీప్రావు తదితరులు పాల్గొన్నారు.