Road Accident | సూర్యాపేట : మునగాల మండలం ముకుందాపురం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆగివున్న కంటైనర్ కిందకు వేగంగా వచ్చిన ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులోనే మృతదేహాలను ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న పెట్రోల్ బంక్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కారు అతివేగంతో కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. వీడియోను చూస్తే షాక్ అవ్వాల్సిందే.
మృతులను నవీన్ రాజా(29), భార్గవి(24)గా గుర్తించారు. వీరిద్దరూ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే కంటైనర్ కింద ఇరుక్కుపోయిన కారును అతికష్టం మీద బయటకు తీశారు. ఆ తర్వాత మృతదేహాలను కారులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలించారు. నవీన్ రాజా విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీలో పని చేస్తున్నట్లు సమాచారం.