Congress | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎంపీ సీటు కూడా మంత్రుల కుటుంబాలకే ఇస్తే ఇక తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు ఇచ్చారని, ఇప్పుడు కూడా అదే జరిగితే తాము ఎప్పటికీ ఇలాగే ఉండాలా? అని పాత కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరించడం పార్టీకి మంచిది కాదని సూచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకొని టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్ టికెట్ కడియం కావ్యకు, మల్కాజిగిరి టికెట్ పట్నం సునీతామహేందర్రెడ్డికి, చేవెళ్ల టికెట్ రంజిత్రెడ్డికి ఇవ్వడంపై సొంత పార్టీ క్యాడర్ తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. వారికి సహరించబోమని తెగేసి చెప్తున్నారు. వరంగల్కు చెందిన కాంగ్రెస్ నేతలు తాము కావ్యకు సపోర్ట్ చేయబోమని ఆ పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షికే నేరుగా ఫిర్యాదుచేసినట్టు తెలిసింది. ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో నెలకొనడంతో అధిష్ఠానం వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నది.
కొత్త వారికి, కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వడంపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన ఇటీవల ఓ కీలక మంత్రిని కలిసిన సందర్భంగా తన ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. పలుచోట్ల కుటుంబసభ్యులకే టికెట్లు ఇస్తున్నారని, మరికొన్ని చోట్ల ఇతర పార్టీ నేతలను చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవడం కష్టమేనని ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
గ్రూపు తగాదాలు, ఇచ్చిన కుటుంబాలకే మళ్లీ మళ్లీ టికెట్లు ఇవ్వడం పార్టీలో అసంతృప్తిని పెంచుతుందని హెచ్చరించినట్టు సమాచారం. సొంత పార్టీ నేతల కన్నా ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలే తమవారికి ముద్దయ్యారంటూ అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
కుటుంబం కోసం తెగ ఆరాటం
ముగ్గురు మంత్రులు ఖమ్మం ఎంపీ టికెట్ను తమ కుటుంబసభ్యులకు ఇప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. పైకి ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే అంటున్నా, లోలోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారనే విమర్శలున్నాయి. మంత్రి పొంగులేటి తన తమ్ముడు వరప్రసాద్కు గానీ, తన వియ్యంకుడు రఘురామిరెడ్డికి గానీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్టు తెలిసింది.
మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్కు టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ముగ్గురు మంత్రులకు పోటీగా వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కూడా కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి, కాంగ్రెస్ పెద్దలను ఒప్పించే పనిలో ఉన్నట్టు తెలిసింది.
అసలుకే మోసం వచ్చే ప్రమాదం
ప్రస్తుతం కాంగ్రెస్లో ఖమ్మం టికెట్పైనే చర్చంతా జరుగుతున్నది. ముగ్గురు మంత్రులు పోటీ పడుతుండటంతో ఎవరికి ఇస్తారన్న ఆసక్తితోపాటు పార్టీ క్యాడర్లో ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. ఇది ఏ మలుపు తిరుగుతుందోనని, అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదని కాంగ్రెస్ కార్యకర్తలు కలవరపడుతున్నారు. ఒకవేళ ఒక మంత్రికి చెందినవారికి టికెట్ దక్కితే ఇతర మంత్రులు, ఇతర నేతలు సహకరించకపోతే పరిస్థితేమిటనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది.