హైదరాబాద్ : మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ.. అడవుల పరిరక్షణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా మట్టి మనిషి కేసీఆర్.. మూడేండ్లలోనే సాగునీటి కష్టాలకు స్వస్తి పలికారు. దాంతో పాటు ఆకుపచ్చ తెలంగాణ కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అటు సేవ్ సాయిల్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సద్గురుకు హ్యాట్సాఫ్.. సాగు, తాగునీరు విషయంలో సమస్యలు అధిగమించిన మా మట్టి మనిషి కేసీఆర్కు కూడా థ్యాంక్స్ చెప్పారు సంతోష్ కుమార్.
హైదరాబాద్ వేదికగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ ఉద్యమం సమిష్టిగా జరిపిన సంగీత కచేరీ – మట్టి కోసం మనం అనే కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ గత 25 సంవత్సరాలుగా మొక్కల ప్రాధాన్యతను చెప్తూనే ఉన్నారు. 24 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి తీసుకుపో ప్రయత్నంలో ఇప్పటికే విజయం సాధించామన్నారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో 8.2 శాతం గ్రీనరీని సాధించామని సంతోష్ కుమార్ తెలిపారు. కేసీఆర్ను ప్రేరణగా తీసుకొని.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సమాజానికి తన వంతు ఏదైనా మంచి చేయాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. మీరందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. చాలా మంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీంతో తనకు మరింత బాధ్యత పెరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతుందన్నారు.
నా వంతు సహాయంతో సేవ్ సాయిల్డ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని ఎంపీ సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. 65 ఏండ్ల వయసులో ఇంట్లో ఉండాల్సిన సద్గురు.. ఇప్పటికే 27 దేశాల్లో 30 వేల కిలోమీటర్లు ప్రయాణించి.. సేవ్ సాయిల్ ఉద్యమంపై అవగాహన తీసుకొస్తున్నారు. ఆయనకు హ్యాట్సాప్. ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోండి. చేయూతను అందిస్తామని సంతోష్ కుమార్ చెప్పారు.
మా మట్టి మనిషి కేసీఆర్.. ఎనిమిదేండ్ల క్రితం ఇబ్బందుల్లో ఉన్న సాగునీటి సమస్యను మూడేండ్లలోనే అధిగమించారని తెలిపారు. వ్యవసాయానికి సరిపడా సాగునీరు అందించాం. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యకు విముక్తి కల్పించాం. మా మట్టి మనిషికి కూడా థ్యాంక్స్. మట్టి విలువ సద్గురు చెప్తున్నారు. దీన్ని అందరూ ప్రేరణగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మనం తినే ఆహారం భూమి నుంచి వస్తుంది. అలాంటి భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మన మనుగడకు ఆధారమైన భూమి తల్లిని కాపాడుకుందామని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.