హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తాను జన్మించిన హైదరాబాద్లోని పేట్లబుర్జు దవాఖానకు ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రకటించారు. శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కలిసి తన నిర్ణయాన్ని వెల్లడించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును అందజేస్తానని తెలిపారు. సంతోష్కుమార్ నిర్ణయం పట్ల హరీశ్రావు అభినందనలు తెలిపారు. ‘కన్నతల్లిని, జన్మభూమిని మరువ వద్దు అంటారు. ఇదే బాటలో ఎంపీ సంతోష్ తాను పుట్టిన పేట్లబుర్జు దవాఖానకు ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయించడం సంతోషం.
ప్రభుత్వ దవాఖానల్లో జన్మించినవారు ఎంపీ సంతోష్ను స్ఫూర్తిగా తీసుకొని దవాఖానల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని హరీశ్రావు పిలుపునిచ్చారు. సంతోష్కుమార్ మాట్లాడుతూ.. దవాఖాన అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, మరిన్ని వసతుల కల్పనకు తన స్నేహితులతో కలిసి సీఎస్సార్ నిధులు సమీకరించి ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు సకల వసతులు సమకూర్చుకుంటున్నామని పేర్కొన్నారు. మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో వైద్య వసతులు మెరుగయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి సంకల్పంలో తాను కూడా భాగస్వామిని కావాలన్న ఉద్దేశంతోనే ఎంపీ నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటవుతుందని, వైద్యరంగంలో తెలంగాణ అనేక రికార్డులను తిరగరాస్తున్నదని పేర్కొన్నారు.