హైదరాబాద్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్సభలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 377 నిబంధన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం, బియ్యం కొనుగోలు విషయమై స్పష్టత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు ఫ్రెండ్లీ పరిపాలన చేస్తున్నారన్నారు. కేసీఆర్ దార్శనికత వల్ల సమృద్ధిగా నీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు పంటల పెట్టుబడి కింద రైతు బంధు, అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఉన్నాయన్నారు. ఈ కారణంగా ఏడాదికి ఏడాది రాష్ట్రంలో పంటలు అధికంగా పండుతున్నాయని, దిగుబడులు పెరుగుతున్నాయి మోదీకి తెలిపారు.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏడాది ఎఫ్. సి. ఐ కొనుగోలు చేసే బియ్యం లక్ష్యాన్ని ఒకేసారి నిర్ణయించే విధంగా ఆదేశించాలని ప్రధానిని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు.
అలాగే, ప్రతి ఏటా పెరుగుతున్న దిగుబడులను అనుసరించి, ఎఫ్ సి. ఐ కొనుగోలును కూడా పెంచాలి. ఎదుగుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం సహకారంగా ఉండాలని, ఆవిధంగా ఎఫ్. సి. ఐ ని ఆదేశించాలని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు.