హైదరాబాద్ : తెలంగాణలో షర్మిల పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విషం చిమ్మడమే షర్మిల లక్ష్యమని ఆరోపించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి తెలంగాణకు ఏం సంబంధమని, ఎవరి రాష్ట్రం వాళ్లదేనన్నారు. పక్క రాష్ట్ర సీఎంగా గౌరవిస్తామన్నారు. బయ్యారం గనులను దోచుకున్నది షర్మిల కుటుంబమేనని, తెలంగాణను దోచుకోవడానికే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రాలో పప్పులు ఉడకట్లేదనే తెలంగాణలో షర్మిల డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
షర్మిల తన మాటలు అదుపులో ఉంచుకోకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలను ఆపడం మా వల్ల కాదని, తెలంగాణలో ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుతున్నారన్నారు. తెలంగాణకు రావాల్సిన విభజన చట్టం హామీల గురించి షర్మిల ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణ రాజకీయాల గురించి షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉందని, తెలంగాణలో షర్మిలకు కేఏ పాల్ కన్నా తక్కువ ఓట్లు వస్తాయన్నారు. షర్మిల కుటుంబం మొత్తం తెలంగాణ వ్యతిరేక కుటుంబం మానుకోట ఘటనలో జగన్ను వంగపల్లి దాటనివ్వలేదన్నారు. షర్మిలపై సంస్కారంతోనే ఉన్నామని, కానీ షర్మిల మాట్లాడే పద్ధతి మాత్రం బాగోలేదన్నారు.