కురవి(మహబూబాబాద్) : పదవతరగతి పరీక్ష పేపరు లీక్లకు సహకరించిన బీజెపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు బడిపిల్లలు,వారి తల్లిదండ్రుల ఉసురు తగలకమానదని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత(MP Maloth Kavitha) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన కురవి మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్(CM KCR)ను ఢీ కొనే శక్తి లేకనే కేంద్రంలోని బీజేపీ(BJP) నీచ రాజకీయాలకు పూనుకుందని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి కుట్రలు పన్నుతుందని విమర్శించారు. కేంద్రం చేసే తప్పులు, నిధులపై నిలదీస్తే దర్యాప్తు సంస్థలతో అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొమ్మిదేళ్లలో లేని పేపర్లీక్లు ఇప్పుడే రావడం వెనుక గల కారణాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దేశమంతా ఆకర్శితం అవుతుంటే జీర్ణించుకోలేక పోతుందని కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని వెల్లడించారు. ఈ సమ్మేళనంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ , జిల్లా పార్టీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.