సూర్యాపేట : సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy )పై ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్(MP Lingaiah Yadav) ఫైర్ అయ్యారు. విదేశాల్లో బీఆర్ఎస్పై అనుచితంగా మాట్లాడిన రేవంత్రెడ్డి తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కార హీనంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భిక్షవల్లే రేవంత్ రెడ్డి నేడు సీఎం అయ్యారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేట (Suryapet)లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. నీ బతుకేంటో మీ పార్టీ నేతలు కోమటిరెడ్డి ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.
అలాంటి వ్యక్తి బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ నేతలకు ముడుపులు చెల్లించి పదవులు తెచ్చుకున్న చరిత్ర నీది. అడ్డగోలుగా మాట్లాడటం ఆపి ఆరు గ్యారంటీలు, సంక్షేమం పై దృష్టి పెట్టాలని సూచించారు. ఆరు గ్యారంటీల అమలు కష్టంగానే ఉంది. ప్రజలకిచ్చిన హామీల అమలు పై కచ్చితంగా కొట్లాడతామాన్నారు. రేవంత్ వ్యాఖ్యలు వీధి రౌడీని తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలోనే రోల్ మోడల్ తెలంగాణాను అభివృద్ధి చేసింది కేసీఆరే. అలాంటి కేసీఆర్ని తూలనాడడం కరెక్ట్ కాదన్నారు. నీకు దమ్ముంటే కేఆర్ఎంబీకి వ్యతిరేకంగా కొట్లాడాలని సవాల్ విసిరారు. కృష్ణా ప్రాజెక్టుల్లో నీటిని డెడ్ స్టోరేజ్ వరకు వచ్చినా మేము రైతులకు అందించాం. ఇంకా 15 టీఎంసీలు ఇచ్చే అవకాశం ఉన్నా ఇప్పుడు ఆయకట్టుకి నీళ్లు లేక అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందన్నారు.