హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరం లాంటిదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. పేదలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్తో కలిసి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు. కంటి వెలుగుకు సీఎం కేసీఆర్ రూ.200 కోట్లు కేటాయించడం గొప్ప విషయం అన్నారు. ఇప్పటికే 55 లక్షల కళ్లద్దాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా కంటి వెలుగు కార్యక్రామన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.
కేసీఆర్ నాయకత్వం కావాలని, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం మోడల్ను దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మేధావులు, తటస్థులు బీఆర్ఎస్పై చర్చించుకుంటున్నారని వెల్లడించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. బండి సంజయ్ రాష్ట్రానికి పైసా పనికొచ్చే పని చేయలేదని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయాలని తాము పార్లమెంటులో పోరాడుతుంటే.. రాష్ట్ర బీజేపీ ఎంపీలు వెకిలి నవ్వులు నవ్వారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలను పట్టించుకోలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రంలో గ్రామస్వరాజ్యం వచ్చిందన్నారు. మోదీ సర్కార్ దున్నపోతుపై వానపడ్డట్లు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.