హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చేపట్టింది దొంగదీక్ష అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రధాని మోదీని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే లక్షా 43 వేల ఉద్యోగాలను భర్తీ చేసి.. మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేయడం కిషన్రెడ్డి అవివేకానికి, అజ్ఞానానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో మునుపెన్నడూ, ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేట్కు అప్పగించి, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత జీవితాలను రోడ్డున పడేసిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఏం చేసిందో కిషన్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎంపీలుగా తాము కొట్లాడుతుంటే, మోదీకి, అమిత్షాకు వత్తాసు పలికిన కిషన్రెడ్డికి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. తామెన్ని చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేయరనే భయంతోనే కిషన్రెడ్డి దొంగ దీక్షచేశారని ఎద్దేవా చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదని కొట్టిపారేశారు. దేశాన్ని, ఉమ్మడి రాష్ర్టాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్.. తన చరిత్రలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇటీవల కర్ణాటకలో అధికారంలోకి రావటానికి కోటొక్క మొక్కులు మొక్కిన కాంగ్రెస్ పార్టీని.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని ఉదహరించారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసిన డిక్లరేషన్లను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేసి తెలంగాణలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలకు తెలంగాణలో ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కులేకనే ప్రచారం కోసం దీక్షలని, డిక్లరేషన్లు అని టైంపాస్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. తమకు పార్లమెంట్ బులెటిన్ అందిందని, ఈ సమావేశాల్లో ఏయే అంశాలు ఉంటాయనేదానికి కేంద్రానికి స్పష్టత లేదని అన్నారు.