Asaduddin Owaisi | హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్.. ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ ముస్లిం పట్ల కాంగ్రెస్ పార్టీకి విద్వేషం ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. గతంలో బీజేపీ నేత కిషన్ రెడ్డితో కలిసి పని చేసినట్లు ఆరోపించారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో ఉన్నాడని, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్కు వెళ్లాడని, అక్కడ నుంచి బీజేపీలోకి వెళ్లినట్లు రేవంత్పై విమర్శలు చేశారు. బీజేపీ నుంచి చంద్రబాబును రేవంత్ ఆశ్రయించాడని ఓవైసీ గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దు అని తమ పార్టీ కార్యకర్తలకు ఓవైసీ హితబోధ చేశారు. దేశంలో కాంగ్రెస్ ఎటువంటి దారణాలకు పాల్పడిందో తాను ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. రాజస్థాన్లో జునైద్ను సజీవంగా కాల్చి చంపారన్నారు. కానీ అతని కుటుంబాన్ని ఇంత వరకు ఆదుకోలేదన్నారు. తాము కర్నాటక నుంచి తెలంగాణకు వచ్చినట్లు కాంగ్రెస్ ఆరోపించిందని, కానీ తాము బాబా ఆజమ్ ఖాన్ వారసులమని ఓవైసీ స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్.. మూడవ సారి అధికారంలోకి వస్తారని ఎంపీ పేర్కొన్నారు. రాజకీయాల్లో ముస్లింల ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం నెహ్రూ, పటేల్ అని ఆరోపించారు. మనకు విచిత్రమైన ప్రధాని ఉన్నారని అన్నారు. కర్నాటకకు కేసీఆర్ పైసలు ఇచ్చినట్లు ప్రధాని ఆరోపించారన్నారు. ప్రధాని విద్వేషాలను పెంచుతున్నారని, ఇది 2014 నుంచి మరీ ఎక్కువైందన్నారు. బీజేపీలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే, ఒక్క ముస్లిం ఎంపీ లేరన్నారు, ముస్లిం మంత్రిలేరన్నారు. మౌనంగా కూర్చోవడానికి తాము రాలేదని, మౌనంగా ఉన్నవాళ్లు ఖతం అవుతారని, తాము పోరాడేందుకు వచ్చినట్లు ఓవైసీ చెప్పారు.