MP Arvind | డిచ్పల్లి, ఫిబ్రవరి 21: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని హత్య చేయించింది ఎవరో తనకు తెలుసని, తన గురించి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హెచ్చరించారు. నిజామాబాద్లో బుధవారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో అర్వింద్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా తనపైన, పార్టీ నేతలపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తన జోలికొస్తే కాంగ్రెస్ నేతల బాగోతం బయటపెడతానని, వైఎస్ను హత్య చేసింది ఎవరో పేర్లతో సహా వెల్లడిస్తానని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి మూడు నెలల్లోనే రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చేయకుండానే బీజేపీ నాయకులను, ప్రధాని మోదీని విమర్శిస్తూ వ్యక్తిగతంగా దిగజారడం సరైన పద్ధతి కాదని చెప్పారు. తనపై, తన కార్యకర్తలపై ఎలాంటి ఆరోపణలు చేసినా మున్ముందు సహించేది లేదని హెచ్చరించారు.